అలా చేసి ఉంటే.. చెన్నకేశవరెడ్డి బ్లాక్‌బస్టరే


‘ఆది’ లాంటి సెన్సేషనల్ హిట్‌తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు వి.వి.వినాయక్. ఆ వెంటనే మంచి ‘నరసింహనాయుడు’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఊపుమీదున్న నందమూరి బాలకృష్ణతో జట్టు కట్టాడు. ఈ కాంబినేషన్ మీద అప్పుడు ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ‘చెన్నకేశవరెడ్డి’ ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఉన్నంతలో వసూళ్లు బాగానే వచ్చినా.. సినిమా ఆశించిన విజయమైతే సాధించలేదు.

ఐతే ఆ సినిమాలో కొన్ని తప్పులు దొర్లాయని, వాటిని సరిదిద్ది.. స్క్రీన్ ప్లేలో మార్పులు చేసి ఉంటే అది కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అయ్యేదని అంటున్నారు ఆ సినిమా రచయితల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ. తన పేరు వెనుక డాక్టర్ ఉండాలన్న తన తల్లి కలను నెరవేర్చడం కోసం అప్పుడు తాను డాక్టరేట్ పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉండటం వల్ల ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో సమయం కేటాయించలేకపోవడం వల్ల తప్పులు సరిదిద్దలేకపోయినట్లు గోపాలకృష్ణ వెల్లడించారు. ఇంతకీ ఈ సినిమాలో పరుచూరి చెబుతున్న తప్పులేంటంటే..

చెన్నకేశవరెడ్డి ఫ్లాష్‌ బ్యాక్‌ను చెప్పడంలో చాలా ఆలస్యం జరగడం సినిమాలో జరిగిన అతి పెద్ద తప్పిదమని పరుచూరి అన్నారు. ప్రథమార్ధంలోనే తన అన్న ఫొటో తీయొద్దని విలన్‌తో హీరో చెల్లెలైన దేవయాని చెప్పి ఉంటే స్క్రీన్ ప్లే బాగుండేదని ఆయనన్నారు. ముందు చిన్న బాలయ్యకు సంబంధించిన కొంత కథను నడిపించి.. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ పెట్టి.. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి పాత్రను ఫైట్‌తో పరిచయం చేసి ఉండాల్సిందని ఆయనన్నారు. నేరుగా ఆ ఫైట్‌తో మొదలుపెట్టారని.. అసలా ఫైట్ ఎందుకనేది కూడా అర్థం కాదని.. అలాగే జడ్జితో చెప్పి చెన్నకేశవరెడ్డిని శివకృష్ణ సింపుల్‌గా రిలీజ్ చేయించడం సరికాదని.. కేసును కోర్టుకు తీసుకెళ్లి లీగల్‌గానే హీరో విడుదలయ్యేలా చేయాల్సిందని పరుచూరి అన్నారు. ఫ్లాష్ బ్యాక్ ముందే రివీల్ చేసి ఉంటే హీరో ప్రతీకారాన్ని ప్రేక్షకులు బాగా ఫీలయ్యేవాళ్లని.. విలన్ మోహన్ రాజ్‌ను అంత సింపుల్‌గా చంపేయడం కూడా బాగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

తన తండ్రి ఫ్లాష్ బ్యాక్ తెలిశాక కూడా చిన్న బాలయ్య ప్రతీకారాన్ని ఫీల్ కాకపోవడం బాగా లేదని.. అతను న్యాయబద్ధంగా విలన్లకు శిక్ష పడేలా చూడటానికి ప్రయత్నిస్తూ తండ్రితో తలపడి ఉంటే బాగుండేదని, అలా కాకుండా తండ్రి మీదే ఎదురు తిరగడం లోపమని.. అన్నింటికీ మించి అన్నేళ్లు భర్త కోసం ఎదురు చూసిన టబు, చిన్న కారణంతో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం, అందుకు చిన్న బాలయ్య బాధ్యుడు కావడం కూడా ప్రేక్షకులకు బాగా అనిపించలేదని పరుచూరి అన్నారు. ఇక రఘుబాబు పాత్ర ‘‘నువ్వు రెడ్డే నేను రెడ్డే’’ అనే డైలాగ్ సినిమాలో ఉండాల్సింది కాదని.. తమ ఇన్నేళ్ల కెరీర్లో అలా కులం మీద డైలాగులు రాయలేదని.. ఆ డైలాగ్ రాసింది వేరే వాళ్లనే రహస్యాన్ని బయటపెట్టారు పరుచూరి. ఈ సినిమాకు సెన్సార్ చేసిన రాయలసీమ అధికారి ఒకరు.. ఈ డైలాగ్ విని, మీకేమైనా రెడ్లంటే కోపమా అని తనను ప్రశ్నించినట్లు పరుచూరి వెల్లడించారు.