ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం వచ్చిన 7జి బృందావన కాలనీ ఒక క్లాసిక్. నిర్మాత ఏఎం రత్నం కొడుకు రవికృష్ణ హీరోగా నటించిన ఈ లవ్ ఎమోషనల్ డ్రామా అద్భుత విజయం సాధించింది. యువన్ శంకర్ రాజా పాటలు యువతని ఊపేశాయి. క్లైమాక్స్ లో హీరోయిన్ చనిపోయే ట్రాజెడీ పెట్టినా సరే జనం విపరీతంగా ఆదరించారు. ఆ టైంలో ఓటిటి, ఫైవ్ జిలు లేవు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా థియేటర్లలో వంద రోజులు ఆడింది. దర్శకుడు సెల్వ రాఘవన్ కు ఇదిచ్చిన బ్రేక్ మామూలుది కాదు. ఇంత సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత ఈ కల్ట్ మూవీకి కొనసాగింపు అది కూడా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది.
ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సెల్వ రాఘవన్ చెప్పిన దాన్ని బట్టి 7జి బృందావన కాలనీ 2 యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రియురాలు చనిపోయాక ఆమె జ్ఞాపకాలతో ఒంటరిగా మిగిలిపోయిన రవి తర్వాత పదేళ్లు ఏం చేశాడనే పాయింట్ మీద ఈ కథ నడుస్తుందట. సోనియా అగర్వాల్ పాత్ర చనిపోయింది కాబట్టి వేరే హీరోయిన్ ఎవరు ఉంటారనేది చూడాలి. అంత నిర్లిప్తంగా మారిపోయిన రవి జీవితంలో తిరిగి ఎవరు వెలుగు తెచ్చారనేది ఆసక్తికరమే. చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్న రవికృష్ణ ఈ సీక్వెల్ తోనే రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. పార్ట్ 2 రిలీజ్ ఈ ఏడాదే ఉంటుందని చెబుతున్నారు.
కాకపోతే రెండు దశాబ్దాల తర్వాత కొనసాగింపు అంటే ఇప్పటి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అన్నట్టు యుగానికి ఒక్కడు సీక్వెల్ కూడా ప్రణాళికలో ఉందట. స్క్రిప్ట్ పనులు పూర్తి కాకుండానే అనౌన్స్ మెంట్ ఇవ్వడం పొరపాటేనని, భారీ బడ్జెట్ డిమాండ్ ఉండటంతో నిర్మాత కోసం ఎదురు చూస్తున్నామని, అన్నీ సెట్ కాగానే ధనుష్ తో ఈ ప్యాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తానని అంటున్నారు. మొదటి భాగంలో ఉన్న కార్తీ ఇందులో కూడా ఉంటాడనే హింట్ ఇచ్చారు. ఫామ్ తగ్గిపోయి ఎక్కువగా నటన వైపు మొగ్గు చూపుతున్న సెల్వ రాఘవన్ తిరిగి తన కంబ్యాక్ ని వీటితో నిరూపించుకుంటారేమో చూడాలి.