బోలెడు శుభవార్తలు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్

దేవర టైంలో ప్రత్యక్షంగా తనను పబ్లిక్ స్టేజి మీద చూసే అవకాశం రాలేదని ఫీలవుతున్న అభిమానుల కోసం ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ మ్యాడ్ సక్సెస్ మీట్ లో ఆ ముచ్చట తీర్చేశాడు. కనిపించడమొకటే కాదు చాలా ముఖ్యమైన శుభవార్తలు పంచుకున్నాడు. వాటిలో మొదటిది దేవర 2. ఇది ఉండదేమోనని కొందరు అనుమాన పడుతున్నారని, కానీ ఇంత ప్రేమ చూపించిన మీకు ఖచ్చితంగా రెండో భాగం అందిస్తానని, అది ఉండి తీరుతుందని ఘంటాపథంగా చెప్పడంతో ఫ్యాన్స్ డౌట్లు తీరిపోయాయి. కామెడీ చేయడం కష్టంగా మారిపోయిన ట్రెండ్ వల్లే అదుర్స్ 2 చేయడానికి భయపడుతున్నానని క్లారిటీ ఇచ్చేశాడు.

నిజానికి దేవర 2 ముందే చేయాలని అనుకున్నా మధ్యలో ప్రశాంత్ నీల్ రావడం వల్ల చిన్న పాజ్ ఇచ్చామని అంతే తప్ప ఆగిపోవడం లాంటివి ఏమీ లేదని కుండ బద్దలు కొట్టేశాడు. నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రాజెక్టు గురించి నేరుగా ప్రస్తావించకపోయినా దగ్గరి భవిష్యత్తులో ఆ సినిమా ఉంటుందనే క్లారిటీ తారక్ నోటి నుంచే వచ్చేసింది. మీరంతా కాలర్ ఎగరేసేలానే నా సినిమాలు ఉంటాయని మరోసారి హామీ ఇచ్చాడు. నితిన్ నార్నె పరిశ్రమకు వస్తానని చెప్పినప్పుడు నా సపోర్ట్ ఉండదు, నీ చావు నువ్వు చావు అంటూ నిరుత్సాహపరిచిన వైనాన్ని గుర్తు చేసుకోవడం ఆడిటోరియంలో నవ్వులు పూయించింది.

చాలా హుషారుగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ మొత్తం అదే ఊపులో కొనసాగించాడు. తనలాంటి హీరోలకు కాళ్లకు దండం పెట్టడం గురించి ప్రస్తావిస్తూ పాదాభివందనం మీ అమ్మానాన్నకు పెట్టమనే సందేశం ఇచ్చాడు. మొత్తానికి దేవర టైంలో మిస్సయిన ఫీలింగ్ ని తారక్ ఇవాళ పొందాడు. అభిమానుల ఈలలు కేకల మధ్య సంతోషంగా కనిపించాడు. ఈ ఏడాది వార్ 2 తో పలకరించబోతున్న యంగ్ టైగర్ జనవరిలో ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా మూవీ ద్వారా తక్కువ గ్యాప్ లో రెండో సారి థియేటర్లకు వచ్చేస్తాడు. ఆర్ఆర్ఆర్ ముందు వెనుకా చాలా గ్యాప్ వచ్చిందని ఫీలవుతున్న ఫ్యాన్స్ ఆకలి తీరబోతోంది.