‘లైగర్‌’కు చేసిన సాహసమే మళ్లీ..

విజయ్ దేవరకొండ కెరీర్‌ను ఇంకో స్థాయికి తీసుకెళ్తుందని అంచనాలు కలిగించిన సినిమా.. లైగర్. దీని మీద విజయ్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. ఈ సినిమా వసూళ్ల లెక్క రూ.200 కోట్ల నుంచి మొదలవుతుందంటూ రిలీజ్ ముంగిట అతను ఇచ్చిన స్టేట్మెంట్ చూసి అభిమానులు ఎంతో ఊహించుకున్నారు. కానీ తీరా చూస్తే ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. విజయ్ ప్రమోషన్ గిమ్మిక్కుల్లో భాగంగా ఏమీ ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈ చిత్రం నిజంగానే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నమ్మాడు. అందుకే పారితోషకం కూడా పూర్తిగా తీసుకోలేదు. సగానికి పైగా రెమ్యూనరేషన్ కట్ చేసుకుని దాన్ని సినిమా నిర్మాణానికి ఇచ్చేశాడు.

తాను వదులకున్న మొత్తానికి తగ్గట్లు లాభాల్లో వాటా తీసుకోవాలనుకున్నాడు. కానీ సినిమా ఏమో డిజాస్టర్ అయింది. విజయ్‌ పారితోషకాన్ని కోల్పోవడమే కాక.. కెరీర్ కూడా దెబ్బ తింది. ఇలాంటి అనుభవం ఎదురయ్యాక ఇకపై పారితోషకం విషయంలో రిస్కులు వద్దనే ఎవ్వరైనా అనుకుంటారు. కానీ విజయ్ మాత్రం మళ్లీ అదే సాహసం చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న ‘కింగ్‌డమ్’ సినిమాకు కూడా ‘లైగర్’ మోడల్‌ను ఫాలో అవుతున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ తనకు రావాల్సిన పారితోషకంలో చాలా వరకు కట్ చేసుకుని దాన్ని ప్రొడక్షన్ కోసం ఇచ్చేశాడని నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

సినిమాకు ఎక్కువ బడ్జెట్ అవుతున్న నేపథ్యంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండేందుకే విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడన్నాడు. తగ్గించుకున్న పారితోషకం మేరకు లాభాల్లో వాటా తీసుకుంటాడని చెప్పాడు. ‘లైగర్’ విషయంలో అంచనా తప్పినప్పటికీ.. ‘కింగ్‌డమ్’ కచ్చితంగా వండర్స్ చేస్తుందని విజయ్ నమ్ముతున్నాడు. మరి మే 30న రిలీజవుతున్న ఈ చిత్రం.. అతడి నమ్మకాన్ని ఎంతమేర నిలబెడుతుందో చూడాలి.