రెడ్ లారీ ఫెస్టివల్స్ మరెన్నో జరగాలి

ఇప్పుడేదో రీ రిలీజుల పేరుతో స్టార్ హీరోల మాస్ సినిమాలను చూసి, అల్లరి చేసి మురిసిపోతున్నాం కానీ నిజమైన క్లాసిక్స్ ని వెండితెరపై చూసే ఛాన్స్ దొరికినప్పుడు వదులుకోకూడదు. సిల్వర్ స్క్రీన్ పై వాటిని చూస్తే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేం. ఇటీవలే హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ‘రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్’ జరిగింది. మార్చి 21 నుంచి 23 దాకా ఎంపిక చేసిన వరల్డ్ మాస్టర్ పీసెస్, టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హిట్స్ అన్నీ కలిపి సుమారు 70 దాకా వివిధ స్క్రీన్లలో ప్రదర్శించారు. మూవీ లవర్స్ పాసులు తీసుకుని ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా అక్కడే ఉండి బోల్డన్ని సినిమాలు చూసుకుని మురిసిపోయారు.

అలనాటి ఆణిముత్యాలు మాయాబజార్ – మిస్సమ్మ , వర్మ క్షణ క్షణం, రాజమౌళి మగధీర, ప్రభాస్ ఛత్రపతి, అడివి శేష్ క్షణం, బాలకృష్ణ ఆదిత్య 369, కమల్ హాసన్ పుష్పక విమానం, కృష్ణవంశీ చందమామ, శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్, రానా నేనే రాజు నేనే మంత్రి మొదలైనవి ఇందులో ప్రీమియర్ చేశారు. అమితాబ్ బచ్చన్ జంజీర్, అమీర్ ఖాన్ జో జీతా వహీ సికందర్, సుభాష్ ఘాయ్ కర్జ్, సన్నీ డియోల్ ఘాతక్, ధర్మేంద్ర యాదోన్ కి బారత్ లాంటి బాలీవుడ్ హిట్స్ ఈ రెడ్ లారీ ఫెస్టివల్ లో భాగమయ్యాయి. ఇక హాలీవుడ్ లో సెవన్ నుంచి మొదలుపెట్టి మొన్న ఆస్కార్ గెలుచుకున్న అనోరా దాకా బోలెడన్ని మూవీస్ కనువిందు కలిగించాయి.

బుక్ మై షో అనుసంధానంతో నిర్వహించిన ఈ చిత్రోత్సవం ఓపెనింగ్, క్లోజింగ్ రెండూ గ్రాండ్ గా జరిగాయి. వేలాది ప్రేక్షకులు చూసిన సినిమాల తాలూకు జ్ఞాపకాలతో పాటు దేవిశ్రీ ప్రసాద్, కృష్ణవంశీ, మంచు విష్ణు, శివ బాలాజీ లాంటి ఎందరో సినీ ప్రముఖులు హాజరు కాగా వాళ్ళ అనుభవాలను ఆహుతులతో పంచుకున్నారు. ఇక్కడ వేసినవి మాత్రమే క్లాసిక్స్ అని కాదు. సమయాభావం, హక్కులు, ప్రింట్ల లభ్యత లాంటి కారణాల వల్ల బోలెడు మిస్సయ్యాయి కానీ భవిష్యత్తులో రెడ్ లారీ తరహా ఫిలిం ఫెస్టివల్స్ మరిన్ని ఈ తరం కోసం తీసుకురావాలి. ఫిలిం మేకర్స్ మాత్రమే కాదు సగటు ఆడియన్స్ నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి.