శ్యామల కేసుపై హైకోర్టు ఎమందంటే…

బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారంటూ టాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపైనా హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో హీరో విజయ్ దేవరకొండతో పాటు రానా దగ్గుబాటి, ప్రణీత, ప్రకాశ్ రాజ్ సహా ఇంకా చాలా మందే ఉన్నారు. వీరిలో యాంకర్ శ్యామల కూడా ఉన్నారు. అయితే ఈ కేసులకు వీరిలో ఏ ఎవ్వరూ పెద్దగా భయపడలేదు. అయితే ఒక్క యాంకర్ శ్యామల మాత్రం తనపై కేసు నమోదు అయ్యిందని తెలియగానే వణికిపోయినట్లున్నారు.

అందుకే కాబోలు…అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆమె ఏకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి ఉపశమనం కూడా సాధించారు. అయితే విచారణకు మాత్రం హాజరుకావాల్సిందేనని… అది కూడా సోమవారమే పోలీసుల వద్దకు వెళ్లాలని ఆమెకు కోర్టు షాకిచ్చింది. కోర్టులో ఏకంగా ఈ కేసును కొట్టివేయాలంటూ శ్యామల కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసును కొట్టేయడం కుదరదని కోర్టు తేల్చిచెప్పింది. అంతేకాకుండా పోలీసుల విచారణకు సహకరించి తీరాల్సిందేనని కూడా ఆదేశించింది. అరెస్టు నుంచి మాత్రమే శ్యామలకు కోర్టు ఊరటనిచ్చింది.

అయినా ఈ కేసులో శ్యామలతో పాటు చాలా మందే ఉన్నారు కదా. యాంకర్ విష్ణుప్రియతో పాటు రీతూ చౌదరి కూడా గురువారమే పోలీసుల విచారణకు హాజరయ్యారు. తమకు తెలిసిన వివరాలు చెప్పారు. పోలీసులు ఇవ్వమన్న సెల్ ఫోన్లను కూడా ఇచ్చేసి వచ్చారు. వీరిని పోలీసులేమీ అరెస్టు చేయలేదు. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్ లు సోషల్ మీడియా వేదికగా తమ వివరణలు జారీ చేశారు. పోలీసులు పిలిస్తే విచారణకు వెళ్లేందుకు కూడా వారు సిద్ధంగానే ఉన్నారని చెప్పాలి. మరి శ్యామల ఒక్కరే ఎందుకు అంతగా భయపడి కోర్టును ఆశ్రయించారన్నది ప్రశ్నగా మారింది.