తెలుగులో భారీ చిత్రాల రిలీజ్ డేట్ల విషయంలో అంతులేని సందిగ్ధత కొనసాగుతోంది. ఒక డేట్ ఇచ్చాక దానికి కట్టుబడుతున్న చిత్ర బృందాలు అరుదుగా కనిపిస్తున్నాయి. ‘హరి హర వీరమల్లు’కు ఇప్పటికే చాలాసార్లు డేట్లు మార్చారు. కొత్తగా మే 9న విడుదలకు ముహూర్తం పెట్టారు కానీ.. ఆ రోజైనా పక్కాగా సినిమా వస్తుందా లేదా అన్నది చిత్ర బృందానికే తెలియాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘విశ్వంభర’ వేసవి రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లే. సమ్మర్ మిస్సయినా, తర్వాత అయినా ఎప్పుడు రిలీజవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. మరోవైపు ఏప్రిల్ 10న రావాల్సిన ‘రాజా సాబ్’ను వాయిదా అయితే వేశారు కానీ.. కొత్త డేట్ ప్రకటించలేదు.
చివరి దశ చిత్రీకరణలో ఉన్న పవన్ కళ్యాణ్ మరో చిత్రం ‘ఓజీ’ రిలీజ్ విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. ఐతే అతి త్వరలోనే వీటిలో రెండు పెద్ద చిత్రాల విడుదలపై స్పష్టత రానున్నట్లు సమాచారం. ‘రాజా సాబ్’ విషయంలో ప్రభాస్ అభిమానుల టెన్షన్ తీర్చేయడానికి చిత్ర బృందం రెడీ అవుతోందట. ఈ సినిమా నుంచి ఇంతకుముందు మిని టీజర్లు రెండు రిలీజ్ చేసిన చిత్ర బృందం.. త్వరలోనే ఫుల్ లెంగ్త్ టీజర్ వదలబోతోందట. ఉగాది లేదా ఇంకో సందర్భం చూసి ఏప్రిల్లోనే ‘రాజా సాబ్’ టీజర్ లాంచ్ చేయబోతున్నారట. టీజర్తో పాటు కొత్త రిలీజ్ డేట్ ఇవ్వబోతున్నారు.
అలాగే ‘ఓజీ’ టీం కూడా సుదీర్ఘ విరామం తర్వాత ఓ టీజర్ వదలబోతోందట. ‘హరి హర వీరమల్లు’ డేట్ ఖరారైన నేపథ్యంలో తమ సినిమా పూర్తి కావడంపై ఒక అంచనా వేసుకుని కొత్త రిలీజ్ డేట్ ప్రకటించాలని చిత్ర బృందం భావిస్తోందట. ఈ క్రమంలోనే వాళ్లూ ఒక టీజర్ వదలబోతున్నారట. ఇంతకుముందు ‘ఓజీ’ నుంచి వచ్చిన టీజర్ ఎలా ప్రకంపనలు రేపిందో తెలిసిందే. ‘రాజా సాబ్’ను ఆగస్టులో, ‘ఓజీ’ని సెప్టెంబరులో రిలీజ్ చేయొచ్చనే అంచనాలున్నాయి. దీనిపై ఏప్రిల్లోనే స్పష్టత రావచ్చు.