మార్కో వచ్చే దాకా హనీఫ్ అదేని అనే కేరళ దర్శకుడు బయట వాళ్లకు పెద్దగా తెలియదు. 2017లో ది గ్రేట్ ఫాదర్ తో డెబ్యూ చేసిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కు తర్వాత మైఖేల్, రామచంద్ర బాస్ అండ్ కో అనే మరో రెండు సినిమాలు పేరు తెచ్చాయి కానీ మార్కో అతని స్థాయిని మార్చేసింది. విపరీతమైన వయొలెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న తీరు ఏకంగా వంద కోట్ల క్లబ్బులోకి తీసుకెళ్లింది. దెబ్బకు హీరో ఉన్ని ముకుందన్ టయర్ 1 స్టార్ లీగ్ లోకి వెళ్లేందుకు మెట్టు వేసేసుకున్నాడు. ఇప్పుడీ హనీఫ్ అదేనితో ప్యాన్ ఇండియా మూవీస్ చేసేందుకు అగ్ర నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నట్టు సమాచారం.
టాలీవుడ్ నుంచి నిర్మాత దిల్ రాజు ఒక మల్టీస్టారర్ ని ప్లాన్ చేస్తున్నారట. ఎస్విసి కాకుండా తన పేరు మీద కూతురు నిర్వహిస్తున్న ప్రొడక్షన్స్ సంస్థ మీద తీసే ప్రతిపాదన ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. అధికారిక ప్రకటన రాలేదు కానీ న్యూస్ అయితే జోరుగా తిరుగుతోంది. ఫ్యామిలీ మూవీస్ కి పెట్టింది పేరైన దిల్ రాజు హింసని ఇంతగా జొప్పించే హనీఫ్ అదేనితో ఎలాంటి ప్రాజెక్టు సెట్ చేస్తారనేది వేచి చూడాలి. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తో తాను పని చేయబోతున్నట్టు హనీఫ్ చెప్పినట్టు మల్లువుడ్ వర్గాల టాక్ చక్కర్లు కొడుతోంది. హిందీ క్యాస్టింగ్ తో ఇది చాలా భారీగా ఉంటుందట.
మార్కో తరహాలోనే కిల్ అనే వయొలెంట్ మూవీతో నిర్మాతగా బ్లాక్ బస్టర్ అందుకున్న కరణ్ జోహార్ ఇప్పుడు హనీఫ్ అదేనితో చేతులు కలిపితే ఎలాంటి కంటెంట్ వస్తుందోనని మూవీ లవర్స్ ఎదురు చూస్తారు. అయితే ఇక్కడ చెప్పిన రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ వచ్చే వరకు ఏదీ చెప్పలేం. ఇక్కడితో అయిపోలేద. మార్కో 2 తీసే ప్రయత్నాలు మొదలయ్యాయని ఇటీవలే ఉన్ని ముకుందన్ చెప్పాడు. మరి హనీఫ్ అదేని కనక దిల్ రాజు, కరణ్ జోహార్ తో చేతులు కలిపితే మార్కో సీక్వెల్ ఆలస్యమవుతుందేమో చూడాలి. ఒక్క బ్లాక్ బస్టర్ ఇంత డిమాండ్ తెచ్చి పెట్టింది.