రానా స్పందించలేదంటే ఏంటర్థం?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మొన్న కొత్త సినిమా అనౌన్స్ అయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో పవన్ సినిమా చేయబోతున్నాడు. అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఇధి ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ అన్నది స్పష్టం. ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన పోలీస్ (అయ్యప్ప) పాత్రలో పవన్ కనిపించబోతున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చేశారు.

ఐతే మాతృకలో పృథ్వీరాజ్ చేసిన కోషీ పాత్రను ఎవరు చేస్తారన్నది సస్పెన్స్‌గా మారింది. నిజానికి పవన్ కంటే ముందు అయ్యప్ప పాత్రకు పలువురి పేర్లు వినిపించాయి. ఒక సందర్భంలో రవితేజ పేరు, మరోసారి బాలయ్య పేరు కూడా తెరపైకి వచ్చాయి. కోషీ పాత్రకు మాత్రం ముందు నుంచి ప్రచారంలో ఉన్న పేరు మాత్రం రానా దగ్గుబాటిదే. కానీ ఇప్పుడు రానా గురించి ఏ కబురూ వినిపించడం లేదు.

పవన్ కళ్యాణ్‌ ఈ చిత్రంలో నటిస్తున్నాడని ప్రకటించినపుడే రానా పేరు కూడా బయటికొస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. రానా సైతం ఈ సినిమా గురించి ఏమీ స్పందించకుండా సైలెంటుగా ఉన్నాడు. నిజంగా పవన్‌తో అతను నటించేట్లయితే ఆ ఎగ్జైట్మెంట్‌ను దాచుకుని ఉండడు. వెంటనే సోషల్ మీడియాలో రెస్పాండై ఉంటాడు. దీన్ని బట్టి అతనీ సినిమాలో నటించట్లేదమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఒకవేళ మరో సందర్భం చూసి ఏమైనా రానా పేరు బయటపెడతారా లేక అతను కాకుండా వేరే ప్రత్యామ్నాయాలేమైనా చూస్తున్నారా అన్నది అర్థం కావడం లేదు. ఈ సినిమాలో పాత్రల్ని బట్టి చూస్తే మాత్రం పవన్ అయ్యప్ప పాత్రకు ఫిక్సయ్యాడు కాబట్టి ఆయన కంటే తక్కువ వయసు ఉండి, స్టార్ ఇమేజ్ కూడా యంగ్ హీరో ఎవరైనా కోషీ పాత్ర చేయాల్సి ఉంటుంది. ఆ కోణంలో చూస్తే రానా ఈ పాత్రకు ఓకే అనిపిస్తాడు. మరి రానా కంటే ఎక్కువ స్టేచర్ ఉన్న యంగ్ హీరో కోసం చిత్ర బృందం చూస్తోందో ఏమో?