తొలి సినిమా గండం.. అన్నకు జరిగినట్లే తమ్ముడికి

మెగాస్టార్ పెద్ద మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అరంగేట్ర సినిమా విషయంలో ఎంతటి దారుణమైన అనుభవాన్నెదుర్కొన్నాడో అందరికీ తెలిసిందే. అప్పట్లో స్టార్ డైరెక్టర్‌గా ఉన్న వైవీఎస్ చౌదరిని నమ్మి రంగంలోకి దిగితే ‘రేయ్’ సినిమా మొదలయ్యాక.. పూర్తి కావడానికి, విడుదల కావడానికి దాదాపు నాలుగేళ్లు పట్టేసింది. ఈ సినిమా సంగతి ఎటూ తేలక తేజు ఎంత ఆవేదన చెంది ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.

ఎన్నో ఆశలతో తెరంగేట్రానికి రెడీ అయితే.. ఇలా సినిమా ఎటూ కాకుండా పోయినపుడు కలిగే బాధ వర్ణనాతీతం. చివరికి ఆ సినిమా సమస్యల్లో చిక్కుకోవడంతో తేజును పెట్టి మెగా ఫ్యామిలీ వేరే సినిమా తీసింది. అదే ముందు రిలీజై మంచి ఫలితాన్నందుకుంది. ఆ తర్వాత ఎప్పుడో ‘రేయ్’ ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. కాగా ఇప్పుడు తేజు తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్‌ను కూడా తొలి సినిమా గండం వెంటాడుతుండటం గమనార్హం.

వైష్ణవ్ ఎన్నో ఆశలతో చేసిన తొలి సినిమా ‘ఉప్పెన’కు వేరే సమస్యలేమీ తలెత్తలేదు కానీ.. కరోనా రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. ఏప్రిల్ 2నే రావాల్సిన ఈ సినిమాకు లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడింది. థియేటర్లు మళ్లీ తెరుచుకున్నా సరే.. అది నామమాత్రమే. అన్ని థియేటర్లూ తెరుచుకుని, వంద శాతం ఆక్యుపెన్సీతో నడిచిన రోజు రిలీజ్ చేద్దామని ఎదురు చూస్తున్నారు. ఓటీటీ రిలీజ్ కోసం కొన్ని ఆఫర్లు వచ్చినా అరంగేట్ర హీరో సినిమాను అలా రిలీజ్ చేస్తే బాగోదని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ఆగుతున్నారు.

మరోవైపు సినిమా బడ్జెట్ ఎక్కువైపోవడం, వడ్డీల భారం పెరిగి ఈ సినిమాను రూ.30 కోట్లకు అమ్మితే తప్ప బయటపడలేని స్థితిలో ఉన్నారు నిర్మాతలు. కరోనా వల్ల బిజినెస్ మునుపటి కంటే తగ్గేలా ఉందే తప్ప పెరిగేలా లేదు. ఈ నేపథ్యంలో డెఫిషిట్‌తోనే రిలీజ్ చేయాలి. కానీ విడుదల ఎప్పుడన్నదే తెలియడం లేదు. సంక్రాంతి ఆశాజనకంగా కనిపిస్తోంది కానీ.. ఆ సీజన్‌ కోసం ఆల్రెడీ నాలుగు సినిమాలు బెర్తులు బుక్ చేసేశాయి. వాటితో పోటీ పడే స్థాయి ‘ఉప్పెన’కు లేదు. తర్వాతి క్రేజీ సీజన్ అంటే వేసవి. అప్పటికి భారీ చిత్రాలు లైన్లో ఉన్నాయి. కాబట్టి పరిస్థితులు అనుకూలిస్తే క్రిస్మస్‌కో లేదంటే జనవరి నెలాఖర్లోనో సినిమా రిలీజయ్యే అవకాశాలున్నాయి.