ఎంత పెద్ద సినిమా అయినా మహా అయితే యాభై రోజుల థియేటర్ రన్ తర్వాత ఓటిటికి వచ్చేయడం చూస్తున్నాం. కొన్ని ఏకంగా రెండు వారాలకు ప్రత్యక్షమవుతున్నవి లేకపోలేదు. అలాంటిది తొమ్మిది నెలల తర్వాత కూడా ఒక పేరున్న హీరో మూవీ రాలేదంటే ఆశ్చర్యమే. శర్వానంద్ మనమేకు ఈ పరిస్థితి తలెత్తింది. గత ఏడాది జూన్ లో రిలీజైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇప్పటిదాకా డిజిటల్ లో రాలేదు. థర్డ్ పార్టీ చేసిన మోసం వల్ల హక్కుల విషయంలో వివాదం తలెత్తిందని లీగల్ గా చూసుకుంటామని ఆ మధ్య నిర్మాత విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది దీని గురించే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రూట్ క్లియరయ్యింది.
త్వరలోనే మనమేని అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చని సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ అడ్డంకులన్నీ తొలగినట్టు తెలిసింది. ఓటిటి సమస్య వల్లే మనమే శాటిలైట్ ప్రీమియర్ కూడా కాలేదు. శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. చైల్డ్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ ఫన్ మూవీకి హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించడం అంచనాలు పెంచింది. కానీ కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. యావరేజ్ గా మిగిలింది. అయితే ఓటిటిలో ఇలాంటివి బాగా రిసీవ్ చేసుకునే దాఖలాలు బోలెడు.
ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసిన ఎన్నో సినిమాలకు రాని ఓటిటి చిక్కు కేవలం మనమేకు మాత్రమే వచ్చింది. అనుకోకుండా జరిగింది కావడం వల్ల ఫ్యాన్స్ ఎక్కువ కాలం నిరీక్షించాల్సి వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఉదంతం మీడియేటర్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలనే సూచనయితే చేసింది. ఇంత లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా మనమే ఏం ప్రూవ్ చేసుకుంటుందో చూడాలి. మనమే తర్వాత శర్వానంద్ మరో సినిమా ఇంకా రాలేదు. నారి నారి నడుమ మురారి చివరి దశ షూటింగ్ తో వేసవి విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు.