విడాకుల వార్తలపై స్పందించిన ఆది పినిశెట్టి

ఇటీవలే ఫిలిం సెలబ్రెటీల విడాకుల వార్తలు తరచుగా వింటున్నాం. గతంలో బాలీవుడ్లో మాత్రమే ఈ వార్తలు ఎక్కువగా వినిపించేవి. కానీ ఈ మధ్య దక్షిణాదిన కూడా ఈ ఒరవడి పెరిగింది. గత కొన్నేళ్లలో నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య, జయం రవి-ఆర్తి, ఇలా చాలా జంటలు విడిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంకేదైనా జంట విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తే జనాలు ఆశ్చర్యపోవట్లేదు. ఇది నిజమా అని అనుమానపడట్లేదు. దీంతో కలిసి ఉన్న జంటలు కూడా ఈ పుకార్లతో ఇబ్బందులు పడుతున్నాయి. సూర్య-జ్యోతిక గురించి ఆ మధ్య ఇలాగే రూమర్లు వినిపించాయి. కానీ ఆ జంట అన్యోన్యంగా ఉన్న సంగతి తర్వాత వెల్లడైంది.

ఇప్పుడు తమిళంలో హీరోగా సెటిలైన తెలుగు కుర్రాడు ఆది పినిశెట్టి వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వారి కుటుంబానికి ఇబ్బందిగా మారింది. ఆది.. కొన్నేళ్ల కిందట తన కోస్టార్ నిక్కి గల్రానిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట విడిపోతున్నట్లుగా ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా ఆది స్పందించాడు. తాము విడిపోవట్లేదని, సంతోషంగా ఉన్నామని ఆది క్లారిటీ ఇచ్చాడు.

‘‘నిక్కీ మొదట్నుంచి నాకు మంచి ఫ్రెండ్. నా కుటుంబ సభ్యులకు కూడా ఆమె బాగా దగ్గరైంది. మా ఇంట్లో వాళ్లు తనకు బాగా నచ్చారు. ఆమె ఉంటే నేను సంతోషంగా ఉంటాననిపించింది. దీంతో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. సంతోషంగా జీవిస్తున్నాం. కానీ మేం విడాకులు తీసుకుంటున్నట్లు యూట్యూబ్‌లు స్టోరీలు కనిపించాయి. మొదట వాటిని చూసి షాకయ్యా, చాలా కోపం వచ్చింది. కానీ ఆ ఛానెళ్లలో పాత వీడియోలు చూస్తే వాళ్ల వ్యవహారం అర్థమైంది. ఇలాంటి వాళ్లను పట్టించుకోవడం వృథా అనిపించింది. క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారని అర్థమైంది’’ అని ఆది తెలిపాడు. ఆది హీరోగా నటించిన ‘శబ్దం’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.