ప్రశాంత్ వర్మతో ప్రభాస్ – ఏం జరిగింది

వందల కోట్ల మార్కెట్ ఉన్నా సినిమాలు చేసే విషయంలో వేగం ఏ మాత్రం తగ్గించే ఉద్దేశంలో లేని ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ వర్మకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. నిజానికి మోక్షజ్ఞని లాంచ్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నాక కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రశాంత్ వర్మకు ఆ ప్రాజెక్టు చేజారిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలాక ఇలా జరగడం అనూహ్యం. ఇప్పుడు ప్రభాస్ తో చేయబోయే కథకు హోంబాలే ఫిలిమ్స్ నిర్మాణం కావడంతో బడ్జెట్ పరంగా ఎలాంటి హద్దులు ఉండబోవడం లేదు. ప్యాన్ ఇండియాని మించే స్థాయిలో ప్లాన్ చేసుకోవచ్చు.

గతంలో ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కు చెప్పి ఒప్పించిన కథే ఇప్పుడు ప్రభాస్ తో చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బ్రహ్మ రాక్షస్ టైటిల్ కూడా బయటికొచ్చింది. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో కొంచెం నెగటివ్ టచ్ ఉన్న హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకున్నారు. కానీ అది స్క్రిప్ట్ వర్క్ అయ్యాక క్యాన్సిల్ చేసుకున్నారు. రణ్వీర్ చేయనని తప్పుకున్నాడు. కట్ చేస్తే రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అది చేయి జారినా ప్రశాంత్ వర్మకు ఏకంగా ప్రభాస్ తో చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కొంచెం టైం పట్టొచ్చు.

ప్రభాస్ ప్రస్తుత దృష్టి ది రాజా సాబ్, ఫౌజీ పూర్తి చేయడం మీద ఉంది. ఆ తర్వాత స్పిరిట్ సెట్స్ లో అడుగు పెట్టాలి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా అవ్వగానే ప్రశాంత్ నీల్ సలార్ 2 శౌర్యంగపర్వంతో రెడీ అవుతాడు. నాగ అశ్విన్ కల్కి 2 కోసం ప్లానింగ్ లో ఉన్నాడు. ఒకవేళ రాజా సాబ్ బ్లాక్ బస్టర్ అయితే దానికీ సీక్వెల్ ఉంటుంది. ప్రభాస్ అన్నింటికీ ఎస్ చెప్పేలా ఉన్నాడు. వీటి మధ్యలో ప్రశాంత్ వర్మది ఎప్పుడు ఉండొచ్చనేది ఆసక్తికరం. రిషబ్ శెట్టితో జై హనుమాన్ అయ్యాక చేయడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇది కాకుండా స్వీయ నిర్మాణంలో ఇతర దర్శకులతో ప్రశాంత్ వర్మ వేరే సినిమాలు కూడా చేస్తున్నాడు.