సందీప్.. ‘సామజవరగమన’ ఎందుకు వదులుకున్నాడు?

హీరోల దగ్గరికి వెళ్లే ప్రతి కథా ఓకే అయిపోదు. కొన్ని తమకు నచ్చక, కొన్ని సూట్ కావేమో అన్న ఉద్దేశంతో వాటిని తిరస్కరిస్తుంటారు. ఆ కథలే వేరే హీరోల దగ్గరి వెళ్లి పట్టాలెక్కేస్తుంటాయి. అవి హిట్టయినపుడు వాటిని రిజెక్ట్ చేసిన హీరోలు ఫీలవడం కామన్. కానీ కొందరు మాత్రం తాము సరైన నిర్ణయమే తీసుకున్నామని అనుకుంటారు. ‘సామజవరగమన’ సినిమా విషయంలో సందీప్ కిషన్ కూడా తాను సరైన నిర్ణయమే తీసుకున్నానని అంటున్నాడు. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకడైన అనిల్ సుంకర.. సందీప్‌కు బాగా క్లోజ్. సందీప్‌కు ‘సామజవరగమన’ కథ బాగా నచ్చిందట కూడా.

కానీ ఆ సినిమాను అతను చేయలేకపోయాడు. దీని గురించి తన కొత్త చిత్రం ‘మజాకా’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు సందీప్. ‘‘సామజవరగమన కథ ముందు నాకే చెప్పారు. నాకు ఆ కథ చాలా బాగా నచ్చింది. నేనే చేద్దామని కూడా అనుకున్నా. కానీ అదే సమయంలో ‘మైకేల్’ మూవీ చేస్తున్నా. అదొక డిఫెంట్ మూవీ. దానికి ఒక మూడ్‌లో ఉండాలి. ఒకలా నటించాలి. ఆ సినిమా చేస్తూ ‘సామజవరగమన’ లాంటి కామెడీ మూవీ చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. అదొక క్రియేటివ్ కాల్.

ఆ సమయానికి నేను సరైన నిర్ణయమే తీసుకున్నానని అనుకుంటా. తప్పో ఒప్పో ‘మైకేల్’ సినిమా డిస్టర్బ్ అవుతుందని.. ‘సామజవరగమన’ చిత్రంలో నటించొద్దని నిర్ణయించుకున్నా. కానీ ఆ సినిమా నాకు చాలా ఇష్టం. దాన్ని వదులుకున్నందుకు బాధ ఏమీ లేదు’’ అని సందీప్ తెలిపాడు. ఇదిలా ఉండగా.. ‘మజాకా’ సినిమాను ముందు మేకర్స్ చిరంజీవి-సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్లో చేయాలనుకున్నారు. కానీ తర్వాత చిరుకు స్థాయికి ఈ కథ చిన్నదవుతుందని.. రావు రమేష్-సందీప్ కలయికలో చేశారు. ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా బుధవారమే విడుదల కానుంది.