కుర్రాళ్ళ అల్లరితో ‘మ్యాడ్ స్క్వేర్’ కామెడీ

కాలేజీ విద్యార్థుల బ్యాక్ డ్రాప్ లో రెండేళ్ల క్రితం వచ్చిన మ్యాడ్ ఎంత పెద్ద హిట్టో చెప్పనక్కర్లేదు. స్టార్ క్యాస్టింగ్ లేకుండా కుర్రాళ్ళ మధ్య కామెడీతో నవ్వించిన తీరు బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ తీసిన ఈ సూపర్ హిట్ కి సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ వచ్చారు. దాన్ని నెరవేరుస్తూ వచ్చే నెల మార్చి 29 రిలీజయ్యేందుకు మ్యాడ్ స్క్వేర్ రెడీ అవుతోంది. ఈ సందర్భంగా టీజర్ రూపంలో శాంపిల్ వదిలారు. ఏదో నిమిషం అర నిమిషం కాకుండా నూటా ఇరవై సెకండ్లలో మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉంటుందో క్లూ ఇచ్చారు.

రెండో భాగానికి సెటప్ మారిపోయింది. చదువు పూర్తి చేసుకుని ఇంటికెళ్ళిపోయిన లడ్డు (విష్ణు) కి వాళ్ళ నాన్న పెళ్లి సంబంధం ఖాయం చేస్తాడు. సరిగ్గా మూడు రోజుల ముందు మిత్ర బృందం (నితిన్ నార్నె- సంతోష్ శోభన్ – రామ్ నితిన్) దిగిపోతుంది. బ్యాచిలర్ పార్టీ కోసం లడ్డుని గోవా తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఎంజాయ్ చేస్తుండగా అనుకోని పరిస్థితుల వల్ల ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం పోలీస్ డ్రెస్సులు వేసుకుని ఏదో వ్యవహారం చేయడానికి కలబడతారు. అసలు వెళ్ళింది దేనికి, జరిగింది ఏమిటి, లడ్డు గాడి లగ్గం చివరికి ఏమైంది లాంటి ప్రశ్నలకు సమాధానం థియేటర్లలోనే తెలుసుకోమంటున్నారు మ్యాడ్ స్క్వేర్ టీమ్.

టైటిల్ కు తగ్గట్టే ఈ సారి ఫన్ డోస్ పెంచేశారు. మొదటి భాగంలాగే డైలాగ్ కామెడీ పేలిపోయేలా ఉంది. బ్యాక్ డ్రాప్ మారినా సరే స్నేహితుల బృందం మరోసారి ఫుల్లుగా సందడి చేశారు. కళ్యాణ్ శంకర్ ఈసారి కూడా యూత్ టింజ్ మిస్ కాకుండా జోకులు రాసుకున్న విధానం వర్కౌట్ అయ్యేలా ఉంది. మ్యాడ్ లో చూపించిన హీరోయిన్లు ఇందులో లేరు. ప్రియాంకా జవల్కర్ మాత్రమే ఉందనే ప్రచారానికి తగ్గట్టే ఈ సీక్వెల్ లో స్వీట్ షాక్ ఇచ్చారు. చివర్లో మాఫియా డాన్ ఫోన్ చేస్తే బాయ్ అని కాల్ కట్ చేయడం లాంటి మెరుపులు చాలానే ఉన్నాయి. ఆశించింది ఉన్నట్టే అనిపిస్తున్న మ్యాడ్ స్క్వేర్ టీజర్ టెస్టులో పాసైపోయింది.