మల్లువుడ్ వివాదాలు దేనికి సంకేతం

రాబోయే జూన్ 1 నుంచి తమ రాష్ట్ర సినీ పరిశ్రమను స్ట్రైక్ రూపంలో స్థంబింపజేయాలని నిర్ణయం తీసుకున్న కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పెద్ద ఇరకాటంలో పడేలా ఉంది. దీనికి ఎంత మాత్రం మద్దతు ఇచ్చేది లేదంటూ మళయాలం మూవీ ఆర్టిస్ట్స్ సంఘం (అమ్మ) తేల్చి చెప్పడంతో వ్యవహారం వాడివేడిగా మారిపోయింది. నటీనటుల పారితోషికాలు, పన్ను విధానాలు భారంగా మారాయని, వీటికి పరిష్కారం కనుగొనేంత వరకు ఎక్కడిక్కడ షూటింగ్స్ ఆపేస్తామని కమిటీ తరఫున సురేష్ కుమార్ గతంలోనే ప్రకటించారు. మమ్ముట్టి, మోహన్ లాల్ తదితరులంతా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇలా చేయడం వల్ల వేలాది కార్మికుల జీవనోపాధికి అడ్డు తగిలినట్టు అవుతుందని, అందువల్ల సపోర్ట్ చేయలేమంటూ, పైగా కొందరు ప్రొడ్యూసర్ల స్వార్థ పూరిత ఆలోచనలను సమర్ధించమని చెప్పడంతో వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. సరే ప్రస్తుతానికి ఇది మల్లువుడ్ సమస్యగానే కనిపిస్తున్నప్పటికీ అందరూ ఆలోచించాల్సిన విషయాలు ఇందులో కొన్ని ఉన్నాయి. ఇచ్చేవాడు ఉన్నాడు కాబట్టే తీసుకునేవాడు రేట్ పెంచడం అనేది ప్రతి వ్యాపారంలో ఉన్నదే. కాయగూరల దగ్గర నుంచి ఖరీదైన కార్ల దాకా అందరిదీ ఇదే సూత్రం.కొనేవాడు లేకపోతే ఐఫోన్ లక్షకు పైనే ఎందుకుంటుంది.

అలాంటప్పుడు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా హీరో హీరోయిన్లు రెమ్యునరేషన్లు తీసుకుంటారు. ఒకవేళ అది ఎక్కువనిపిస్తే వద్దనుకుని వేరే ఆప్షన్ చూసుకునే స్వాతంత్రం ప్రొడ్యూసర్ కు ఎప్పుడూ ఉంటుంది. అలా కాకుండా ఇలా స్ట్రైక్ లకు దిగడం ఏమిటనేది ఆర్టిస్టుల వాదన. సొమ్ము తగ్గించుకుంటే మరిన్ని ఎక్కువ సినిమాలు తీస్తామనేది నిర్మాతల వెర్షన్. అయినా కంటెంట్ ఆధారంగా తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసే కేరళలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ వాటిని తట్టుకుని నిలబడటం చూస్తే గ్రేటే అనిపిస్తుంది. అయినా లోగుట్టు పెరుమాళ్ళకెరుకని ఏ ఇబ్బందులు ఎవరికి తెలుసని.