కంగనా.. ఇది మరీ టూమచ్

కంగనా రనౌత్ ధైర్యం చూసి కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇండస్ట్రీ బడా బాబుల మీద ఆరోపణలు, విమర్శలు చేయడానికి ఆమె ఎంతమాత్రం వెనుకాడదు. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఇలా ఓ స్టార్ హీరోయిన్ ధాటిగా, ధైర్యంగా మాట్లాడటం అరుదైన విషయమే. కంగనాకు భారీగా ఫాలోయింగ్ రావడానికి కూడా ఇదొక కారణం.

ఐతే ఈ క్రమంలో కంగనా కొన్నిసార్లు శ్రుతి మించిపోవడం ఆమె ఫాలోవర్లకు కూడా రుచించదు. ఈ మధ్య హిందుత్వ అజెండాతో ఆమె ముందుకు వెళ్తుండటం, తన ప్రయోజనాల కోసం సుశాంత్ ఆత్మహత్య లాంటి అంశాల్ని వాడుకునేందుకు ప్రయత్నించడం తనపై వ్యతిరేకతను పెంచింది. కేంద్రం ఆమెకు భారీగా భద్రత కల్పించిన నేపథ్యంలో మోడీ సర్కారు అండతో, రాజకీయ ఉద్దేశాలతో ఆమె బాలీవుడ్‌లో ఓ వర్గాన్ని, శివసేన సర్కారును టార్గెట్ చేస్తోందన్న అభిప్రాయం బలంగా కలుగుతోంది.

తాజాగా కంగనా చేసిన వ్యాఖ్యల్ని చూస్తే ఆమె తన గురించి తాను చాలా ఎక్కువ ఊహించుకుంటోందని స్పష్టమవుతోంది. మహారాష్ట్ర సర్కారు తనను జైలుకు పంపాలని అనుకుంటోందని.. వాళ్ల ప్రయత్నం విజయవంతమై తాను జైలుకు వెళ్లాల్సివస్తే సంతోషంగా వెళ్తానని కంగనా పేర్కొంది. ఒకప్పుడు సావర్కార్, ఝాన్సీ లక్ష్మీబాయి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా జైలుకు వెళ్లారని, తాను ఆరాధించే ఆ వ్యక్తులందరూ జైలుకు వెళ్లినపుడు తాను కూడా సంతోషంగా అక్కడికి వెళ్తానని.. అప్పుడు తన జీవితానికి ఒక అర్థం వస్తుందని కంగనా వ్యాఖ్యానించింది.

అంతే కాదు.. ఒకప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి కోటను కూల్చేసినట్లే ఇప్పుడు తన ముంబయిలో ఆఫీసును కూల్చేశారని ఆమె అంది. తెర మీద ఝాన్సీ పాత్ర చేసేసరికి కంగనా సైతం నిజంగా ఝాన్సీ లాగే ఫీలైపోతోందని.. చరిత్రలోని గొప్ప గొప్ప నేతలతో తనను పోల్చుకోవడం అతి అని నెటిజన్లు కంగనాను విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఒకప్పుడు దేశంలో అసహనం పెరిగిపోతోందని వ్యాఖ్యలు చేసిన ఆమిర్ ఖాన్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘‘ఈ అసహనం బ్యాచ్ ఈ అసహన దేశంలో ఎంతగా ఇబ్బంది పడిందో కొంచెం వివరించాలి’’ అంటూ ఒక ట్వీట్‌లో ఎద్దేవా చేసింది కంగనా.