ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ ఒకేసారి సెట్ల మీద పెట్టిన ప్రభాస్ ఎప్పుడప్పుడు స్పిరిట్ మొదలుపెడతాడాని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. బాహుబలి స్టార్, యానిమల్ డైరెక్టర్ కాంబో అంటే ప్యాన్ ఇండియా స్థాయిలో మోత మోగడం ఖాయం. అసలు షూటింగ్ ప్రారంభం కాకముందే దీనికి ఓ స్థాయిలో బిజినెస్ ఎంక్వయిరీలు వస్తున్నాయంటే క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. సందీప్ రెడ్డి వంగా ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ చేశాడు. ప్రభాస్ లుక్ కు సంబంధించి స్కెచ్చులు రెడీ అయ్యాయి. డార్లింగ్ ఫ్రీ అవ్వగానే ఫోటో షూట్ చేసి వాటితోనే అనౌన్స్ మెంట్ ఇవ్వాలనే ప్లాన్ ఉందట.
తాజాగా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం స్పిరిట్ చిత్రీకరణ మే నుంచి మొదలవ్వొచ్చు. కీలక ఆర్టిస్టుల డేట్లు దొరకని కారణంగా షెడ్యూలింగ్ చేయడం సందీప్ వంగాకు కష్టంగా మారిందట. ప్రస్తుతం ఆ సమస్య పరిష్కారం అయినట్టు చెబుతున్నారు. కీలకమైన రెండు పాత్రలకు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఇద్దరినీ తీసుకున్నారనే లీక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో అఫీషియల్ గా బయటికి వస్తే కానీ చెప్పలేం. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడని మోస్ట్ వయొలెంట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ విశ్వరూపం చూస్తారని యూనిట్ తెగ ఊరిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ప్లాన్ చేశారట.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ తర్వాత సందీప్ వంగా చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. హీరోయిన్ ఎవరనేది కూడా ఇంకా గుట్టుగా ఉంది. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న ఇలా ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి కానీ అసలు నిజమేంటో ఒక్క సందీప్ కు మాత్రమే తెలుసు. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ రెండు నెలల క్రితమే పాటల కంపోజింగ్ మొదలుపెట్టగా ఇతర టీమ్ సభ్యులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న స్పిరిట్ ప్రాధమికంగా అంచనా వేసిన బడ్జెటే రెండు వందల కోట్లు దాటేసింది. ఇది రెట్టింపైనా ఆశ్చర్యపోనక్కలేదు.