కొత్త సినిమాలకు క్రికెట్ మ్యాచ్ టెన్షన్

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ ఆటంటే ఏ స్థాయిలో జ్వరం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ 50 ఓవర్ల వండే మ్యాచ్. ఇంతకన్నా వినోదం వేరొకటి ఉంటుందా. పైగా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ. ముఖ్యంగా క్రికెట్ ప్రేమికులు ఆ రోజు మధ్యాన్నం నుంచే పనులన్నీ మానుకుని టీవీ సెట్ల ముందు తిష్ట వేసుకుని కూర్చుంటారు. మరి కొందరు ఓపెన్ గ్రౌండ్స్, రెస్టారెంట్లు, పబ్బుల్లో లైవ్ షోలు ప్లాన్ చేసుకుంటున్నారు. సరిగ్గా ఈ విషయమే కొత్త రిలీజులకు టెన్షన్ కలిగిస్తోంది. ఎందుకంటే సెలవు రోజు అధిక శాతం జనాలు ఇళ్లలోనే ఉంటే థియేటర్లు బోసిపోతాయి. ఇదో పెద్ద రిస్క్ అనిపించే విషయం.

ఈ సశుక్రవారం ఫిబ్రవరి 21 వస్తున్న రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చిన్న బడ్జెట్ వే. రామం రాఘవం, బాపు మంచి ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందినవి. టాక్ ఖచ్చితంగా బాగా వస్తుందనే నమ్మకంతో బాగా ప్రమోట్ చేసుకోవడమే కాక ముందస్తు ప్రీమియర్లకు సిద్ధమవుతున్నాయి. అలాంటప్పుడు క్రికెట్ రూపంలో సెలవు రోజు స్పీడ్ బ్రేక్ పడితే కష్టం. అందులోనూ ఫిబ్రవరి 26 సందీప్ కిషన్ మజాకా ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో మాస్ ని టార్గెట్ చేసుకుని వస్తోంది. ఆలోగా వీలైనంత వసూలు చేసుకుంటే రెండో వారంలో స్లో అయినా రామం రాఘవం, బాపు సేఫ్ అవుతాయి. వీక్ డేస్ లో ఆక్యుపెన్సీలు తగ్గుతాయి.

ఇవే కాదు డబ్బింగ్ సినిమాలు జాబిలమ్మ నీకు అంత కోపమా, రిటర్న్ అఫ్ ది డ్రాగన్ లకు సైతం ఇదే సమస్య రానుంది. సురేష్, మైత్రి లాంటి పెద్ద సంస్థలు పంపిణి చేస్తున్నాయి. తెలుగు మార్కెట్ వరకు చూసుకుంటే అవి అనువాదాలు కాబట్టి ఇబ్బంది లేదు. పైగా యూత్ ని టార్గెట్ చేసుకున్నవి. ఒకవేళ బాగున్నాయంటే తర్వాతి రోజు నుంచి కాలేజీలు ఎగ్గొట్టి మరీ కుర్రకారు వచ్చేస్తారు. ఇంకోపక్క చావా ఏ సెంటర్స్ లో జోరు చూపిస్తోంది. సరే ఏది ఏమైనా క్రికెట్ మ్యాచ్ ని ఇష్టపడని వాళ్ళు సినిమాలకు వస్తారు కానీ ఆ పర్సెంటేజ్ ఎంత ఉండొచ్చనేది కీలకం కానుంది. చూడాలి క్రికెట్ వర్సెస్ సినిమాలో ఎవరు గెలుస్తారో.