గత ఏడాది కల్కి 2898 ఏడి రూపంలో వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు నాగ అశ్విన్ రెండో భాగం స్క్రిప్ట్ పనులతో పాటు కొంత మేరకు ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసినట్టుగా టాక్ ఉంది. అయితే షూటింగ్ ఎప్పటి నుంచి మొదలుపెడతారనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. నిర్మాత అశ్వినిదత్ ఆ మధ్య జూన్ ఉంచి ఉండొచ్చని హింట్ ఇచ్చారు కానీ ప్రభాస్ ఉన్న బిజీ చూస్తుంటే అదంత సులభం కాదనిపిస్తోంది.
ఎందుకంటే ది రాజా సాబ్, ఫౌజీ పూర్తి చేసుకున్నాక కేవలం స్పిరిట్ మాత్రమే సెట్స్ మీద ఉంచాలని సందీప్ రెడ్డి వంగా అడిగితే దానికి డార్లింగ్ ఎస్ చెప్పాడని వినికిడి. అంటే అప్పటిదాకా కల్కి 2 డౌటే.
సో అంత సమయం వేచి ఉండటం కన్నా ఈలోగా మరో ప్యాన్ ఇండియా మూవీ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో నాగ్ అశ్విన్ ఉన్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ తో ప్రాధమికంగా కథకు సంబంధించిన చర్చ చేసినట్టు ముంబై రిపోర్ట్.
ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టు కావడంతో ఆమెనే మొదటి ఛాయస్ గా పెట్టుకున్నాడట. కానీ అలియాకు డేట్ల సమస్య ఉంది. అల్ఫా, లవ్ అండ్ వార్, చాముండాలు తన చేతిలో ఉన్నాయి. అన్ని వివిధ దశల్లో ఉన్నాయి కానీ ఏదీ పూర్తి కావడానికి దగ్గరలో లేదు. అలాంటప్పుడు నాగ్ అశ్విన్ కోరినన్ని డేట్లు ఇవ్వాలంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.
ఇదంతా తేలడానికి కొంత సమయం పడుతుంది. ప్రముఖ ఏవిఎం సంస్థకు నాగ్ అశ్విన్ ఒక కమిట్ మెంట్ బాకీ ఉన్నాడట. అది అలియా భట్ తోనే చేయొచ్చని తెలుస్తోంది. విశ్వంభర విఎఫ్ఎక్స్ పనులను సూపర్ వైజ్ చేసే బాధ్యతను చిరంజీవి రిక్వెస్ట్ మీద నాగ్ అశ్విన్ కే ఇచ్చినట్టు టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో తెలియాలి.
ఇటీవలే జరిగిన బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాగ్ అశ్విన్ రావడానికి కారణం ఇదే అంటున్నారు. వైజయంతి బ్యానర్ తో అనుబంధం దృష్ట్యా నిజంగా చిరు అడిగి ఉంటే కాదని అనకపోవచ్చు. ప్రస్తుతానికి ఇదంతా ప్రచారం దశలోనే ఉంది కాబట్టి నిర్ధారించలేం.