ఆగిపోయిన చిరంజీవి సినిమా కూడా వస్తుందా?

పదిహేడు నిమిషాల ఫుటేజీ మాత్రమే వున్న నర్తనశాల చిత్రాన్ని అలా అసంపూర్ణంగానే విడుదల చేస్తున్నారు. ఏటిటి ద్వారా నచ్చిన వాళ్లే ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నారు. చారిటీకి ఈ డబ్బులిస్తామని చెప్పడం వల్ల అసంపూర్ణ సినిమా విడుదల చేస్తున్నారనే నిందలేమీ పడడం లేదు. కాకపోతే పైరసీ తాకిడి వుంటుంది కనుక ఇది ఎంతవరకు పే చేస్తుందనేది రిలీజ్‍ అయ్యాక కానీ తెలీదు.

ఇదిలావుంటే ఈ సినిమాను ఇలా అసంపూర్ణంగా విడుదల చేస్తుండడంతో చాలా ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా మొదలైన భారీ చిత్రం ‘అబు: బాగ్దాద్‍ గజదొంగ’ చిత్రం ఫుటేజీని కూడా విడుదల చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అప్పట్లో బడ్జెట్‍ పెరిగిపోవడం, ముస్లిమ్‍ నేతల నుంచి తిరుగుబాటు రావడంతో ఆ సినిమా కొంత షూటింగ్‍ చేసి ఆపేసారు. దాంతో చిరంజీవిని అలా చూడాలనే అభిమానుల కోరిక మాత్రం అలా మిగిలిపోయింది.

నర్తనశాల ఇలా వస్తోంది కనుక అబు కూడా వస్తే చూడాలని వుందని అభిమానులు అంటున్నారు. నర్తనశాల అంటే బాలకృష్ణ సొంత ప్రాజెక్ట్ కనుక ఆ ఫుటేజీ భద్రపరచుకున్నారు. మరి అబుకి సంబంధించిన ఫుటేజీ ఎవరైనా జాగ్రత్తగా పెట్టారో లేదో? ఏదేమైనా నర్తనశాల కారణంగా అబు సినిమాని ఫాన్స్ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు.