కష్టాల్లో ఉన్న కెన్నడీకి టాలీవుడ్ అండ

బాలీవుడ్ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ లాంటి క్లాసిక్స్ పరిశ్రమకు అందించిన దర్శకుడిగా ఈయన ఫాలోయింగ్ పెద్దదే. రామ్ గోపాల్ వర్మ దగ్గర రచయితగా చేయడం దగ్గరి నుంచి తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకోవడంలో ఇతను వేసిన ముద్ర ప్రత్యేకం.

ఇటీవలి కాలంలో నటుడిగా మారిపోయి తమిళ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. విజయ్ సేతుపతి మహారాజ, విడుదల పార్ట్ 2 లాంటివి బాగానే పేరు తీసుకొచ్చాయి. అయితే డైరెక్టర్ గా అనురాగ్ కశ్యప్ గత కొంత కాలంగా ఫామ్ లో లేరు. వరస ఫ్లాపులు గ్రాఫ్ ని కిందకు తీసుకొచ్చాయి.

ఆయన కొత్త సినిమా కెన్నడీ విడుదలకు సిద్ధంగా ఉంది కానీ రెండేళ్లుగా ల్యాబ్ నుంచి బయటికి రాలేక అష్టకష్టాలు పడుతోంది. 2023లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జియో మామి చిత్రోత్సవంలో రెండు వేల మంది ప్రీమియర్ చూసి లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు.

కానీ కెన్నడీ ఇప్పటిదాకా థియేట్రికల్ గా బయటికి రాలేదు. తాజాగా హైదరాబాద్ లో వేసిన షోకు టాలీవుడ్ ప్రముఖులు విచ్చేయడం హాట్ టాపిక్ గా మారింది. సందీప్ రెడ్డి వంగా, సుకుమార్, విజయేంద్ర ప్రసాద్, సురేష్ బాబు, రానా దగ్గుబాటి తదితరులు హాజరయ్యారు. హడావిడి లేకుండా ప్రీమియర్ వేశారు.

షో అయ్యాక సుమారు రెండు గంటల పాటు వీళ్లంతా అనురాగ్ కశ్యప్ తో కెన్నడీ గురించి మాట్లాడ్డం విశేషం. నిర్మాతల అలసత్వం వల్ల రిలీజ్ ఆగిపోయిన కెన్నడీకి సురేష్ సంస్థ అండదండలు దొరకొచ్చని ఇన్ సైడ్ టాక్. అందులో భాగంగానే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు వినికిడి.

కంటెంట్ ఉన్న సినిమాలకు మోక్షం కలిగించేందుకు రానా ఎప్పుడూ ముందుంటాడు. మరి కెన్నడీకి నిజంగా మద్దతు ఇస్తాడా లేక కేవలం మార్కెటింగ్ కోసం షో వేశారా అనేది తెలియాల్సి ఉంది. రాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలు పోషించారు. నిద్రకు సంబంధించిన వ్యాధితో బాధపడే ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ కథే కెన్నడీ.