అల్లు అర్జున్ ఓటు ఏ దర్శకుడికి

పుష్ప 2 ది రూల్ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ సాధించాక అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఏంటనే దాని మీద తెలుగు ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్ లోనూ విపరీతమైన ఆసక్తి పెరిగింది. దానికి తగ్గట్టే బాలీవుడ్ బయ్యర్లు ఇప్పటి నుంచే ఆ ప్రాజెక్టు తాలూకు బిజినెస్ డీల్స్ గురించి ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టారట.

నిర్మాత ఎవరో తెలిస్తే అడ్వాన్స్ రూపంలో గాలం వేసేందుకన్న మాట. అయితే బన్నీ ముందు చేయాల్సింది త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్యాన్ ఇండియా మూవీ. గుంటూరు కారం తర్వాత ఏడాదికి పైగా మాటల మాంత్రికుడు ఈ స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నారు. త్వరలోనే కొలిక్కి తెస్తారట.

అయితే సెట్స్ కు ఎప్పుడు తీసుకెళ్లాలనేది హారికా హాసిని, గీతా సంస్థలు ఇంకా నిర్ణయం తీసుకోలేదని వినికిడి. ఇంకోవైపు ఆట్లీ అల్లు అర్జున్ కోసం కథను సిద్ధం చేసుకుని పెట్టాడు. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే మొదలుపెట్టేస్తాడు. లేదూ కొంచెం వెయిట్ చేయాలంటే సల్మాన్ ఖాన్ తో ప్లాన్ చేసుకున్న యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రొసీడవుతాడు.

ఆట్లీకి బన్నీ ఎస్ చెప్పింది నిజమేనట కానీ ఎప్పటి నుంచి అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. లేట్ అయినా పర్వాలేదు పర్ఫెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఐకాన్ స్టార్ ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందుకే ప్రకటనకే ఇంత టైం పడుతోంది.

అభిమానులకు ఇకపై స్పీడ్ పెంచుతానని హామీ ఇచ్చిన అల్లు అర్జున్ కు దాన్ని ప్రాక్టికల్ గా అమలు చేయడం అంత సులభం కాదు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో త్రివిక్రమ్ రాసుకున్న స్టోరీ గురించి ఇండస్ట్రీలో గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏ ఫాంటసీ మూవీలో లేని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని చెబుతున్నారు.

అట్లీ మాత్రం కమర్షియల్ జానర్ లోనే కథను రాసుకున్నప్పటికీ జవాన్, తేరికి అయిదింతలు ఎక్కువ హీరోయిజం అనిపించేలా పాత్రను డిజైన్ చేశాడట. చివరికి ఏది ఫైనల్ అవుతుందో ఏది ముందు పట్టాలు ఎక్కుతుందో కాలమే సమాధానం చెప్పాలి. అప్పటిదాకా వేచి చూద్దాం.