నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన: చిరంజీవి!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను సాక్ష్యాత్తూ ప్రధాని మోదీ పవన్ ను ఏ ఆంధీ హై అంటూ ఆకాశానికెత్తేసిన సంగతి తెలిసిందే. ఇక, మెగా స్టార్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిపై కూడా ప్రధాని మోదీ ప్రత్యేకమైన అభిమానం ఉంది. ‘తమ్ముడు’ పవన్, మెగా బ్రదర్ నాగబాబులకు తోడుగా ‘అన్నయ్య’ చిరంజీవి కలిసి వస్తే జనసేన మరింత బలపడుతుందని, రాష్ట్ర రాజకీయాల్లో ఈ ముగ్గురు మొనగాళ్లు కచ్చితంగా చక్రం తిప్పుతారని మెగా ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా జనసేనకు చిరంజీవి తొలిసారిగా జై కొట్టారు. అంతేకాదు, ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది అంటూ చిరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘లైలా’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వక్సేన్ వాళ్ల నాన్న కరాటే రాజు గారు తనకు 18 ఏళ్లుగా తెలుసని, ప్రజారాజ్యం సమయం నుంచి తమ ఇద్దరి మధ్య పరిచయం ఉందని అన్నారు.

అలా ప్రజారాజ్యం గురించి ప్రస్తావించిన తర్వాత చిరు జై జనసేన అన్నారు. చాలా కాలం తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన, జనసేన పేరు బహిరంగ వేదికపైన ప్రస్తావించారు. ఈ ఈవెంట్ కు వచ్చిన మెగా అభిమానులంతా జై జనసేన అంటూ నినాదాలు చేస్తుంటే…వారితోపాటు చిరు కూడా జై జనసేన అన్నారు. మెగాస్టార్ నోట జై జనసేన అని తొలిసారి విన్న మెగా ఫ్యాన్స్ కేరింతలు, కేకలు, ఈలలతో హోరెత్తించారు.

2011 ఆగస్టులో కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం గురించి చిరు మాట్లాడింది చాలా తక్కువ సందర్భాల్లోనే. ఇక, గత ఐదేళ్ల కాలంలో అయితే ఎప్పుడూ ప్రజారాజ్యం ప్రస్తావన చిరు తేలేదు. సడన్‌గా ఈ రోజు ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని చిరు మాట్లాడడంతో జనసైనికులు, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక, ఇటీవల ఓ ఈవెంట్ లో ప్రధాని మోదీతోపాటు చిరంజీవి కూడా పాల్గొన్నారు.

త్వరలోనే పవన్ కు తోడుగా చిరు రాజకీయాల్లో చక్రం తిప్పేలా అక్కడ చర్చలు జరిగాయని, జాతీయ స్థాయిలో చిరుకు రాజ్య సభ ఎంపీ లేదా మరేదైనా పదవి ఇచ్చే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా చిరు కూడా జనసేన గురించి మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకుందని అభిమానులు భావిస్తున్నారు.