“జానీ ఫలితం పవన్ కి ముందే అర్థమైపోయింది” : అల్లు అరవింద్

ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ ఆ టైంలో మాత్రం ఇది డిజాస్టరే. ఖుషి లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ పవర్ స్టార్ స్వీయ దర్శకత్వం.

ఛార్ట్ బస్టర్స్ ఇవ్వడం అలవాటుగా చేసుకున్న రమణ గోగుల సంగీతం. అన్నింటికి మించి గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మాణం. ఇంకేం అభిమానులు మళ్ళీ రికార్డులు బద్దలు కావడం ఖాయమనుకున్నారు. తీరా చూస్తే నిరాశకే నిరాశ కలిగించే ఫలితాన్ని జానీ అందుకుంది. ప్రేక్షకులు మొహమాటం లేకుండా తిరస్కరించారు.

తండేల్ ప్రమోషన్లలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పటికీ జానీ తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని, పవన్ కళ్యాణ్ ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు ఇలా జరగడం ఊహించలేదని, తన ఇమేజ్ దాటి ప్రయోగం చేయడాన్ని ఆడియన్స్ అంగీకరించలేదని అన్నారు.

షూటింగ్ జరుగుతున్న ఒక దశలో తనకు పవన్ కు దీని మీద అనుమానం కలిగినా వెనక్కు వచ్చే పరిస్థితి లేకపోవడంతో కొనసాగించామని, భయపడినట్టే ఫ్లాపయ్యిందని వివరించారు. రిలీజ్ కు ముందు జానీకు జరిగిన బిజినెస్, ఆడియో అమ్మకాలు, శాటిలైట్ డిమాండ్ తదితర విషయాలు మీడియాలో బాగా హైలైటయ్యేవి.

అల్లు అరవింద్ చెప్పిన మాటల్లో అర్థం చేసుకోవాల్సిన పాయింట్లు కొన్ని ఉన్నాయి. ఒక స్టార్ హీరో మీద మార్కెట్ పరంగా పెద్ద బడ్జెట్ చేస్తున్నప్పుడు ఎక్స్ పరిమెంట్లు చేయకూడదు. అందులోనూ పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు ప్రేక్షకులు కూడా చాలా ఆశిస్తారు.

వాటిలో సగం అందుకోగలిగినా హిట్టు కొట్టే కెపాసిటీ తనది. అలాంటిది జబ్బు పడిన హీరోయిన్, పీలగా ఉండే హీరో, మనకు అంతగా పరిచయం లేని బాక్సింగ్ నేపధ్యం ఇవన్నీ మాస్ జనాలకు కనెక్ట్ కాలేదు. దీంతో జానీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాడు. కానీ డైరెక్టర్ గా పవన్ ఒక కొత్త అనుభూతినిచ్చే ప్రయత్నం చేయడం విశేషం.