తండేల్ రేట్ల పెంపుపై హాట్ డిస్కషన్లు

ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది. దేవర, కల్కి లాగా వందల కోట్ల బడ్జెట్ తో తీసింది కానప్పుడు ఇలా హైక్ ఎందుకనే కోణంలో సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్లు కనిపిస్తున్నాయి. అలాని తండేల్ కు జరిగిన ఖర్చు తక్కువేమి కాదు.

వంద కోట్ల దాకా పెట్టినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ నాగ చైతన్యకున్న మార్కెట్ దృష్ట్యా మల్టీప్లెక్స్ టికెట్ మీద 75 రూపాయలు, సింగల్ స్క్రీన్ 50 రూపాయలు పెంచడం ఏ మేరకు వర్కవుట్ అవుతుందనేది పూర్తిగా టాక్ మీద ఆధారపడి ఉంటుంది.

తెలంగాణలో ఎలాంటి హైక్ లేకపోయినా మల్టీప్లెక్స్ గరిష్ట ధర 295 రూపాయలు ఉంది. ఇప్పుడు ఏపీలో పెంచిన తర్వాత కూడా 252 అవుతుంది. అంటే వ్యత్యాసం నలభై పైమాటే. గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టిన సినిమాలకు కూడా ఏపీలో 177 రూపాయలే ఉండేది.

కొన్ని చోట్ల 148, సింగల్ స్క్రీన్ 110కి అమ్మేవారు. అనుమతులు తెచ్చుకోవడంలో జాప్యం కారణంగా చాలా నిర్మాతలు అసలు అప్లై చేసుకోవడమే మానేశారు. కేవలం నైజామ్ లో పర్మిషన్లు తీసుకుని బ్యాలన్స్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడా బాధ తప్పింది. అడగటం ఆలస్యం ఇండస్ట్రీ మనుగడ దృష్ట్యా కూటమి సర్కారు ఎస్ అనేస్తోంది.

సో తండేల్ కనక బాగుంటే ప్రేక్షకులు అదనంగా ఇచ్చింది భారంగా ఫీలవ్వరు. సంక్రాంతికి వస్తున్నాంకి తండేల్ కంటే తక్కువ బడ్జెట్ అయినా 125 రూపాయల హైక్ వచ్చింది. అయినా సరే రెండు వారాలు హౌస్ ఫుల్ బోర్డులు తీయాల్సిన అవసరం పడలేదు. అంటే ఆడియన్స్ కి నచ్చితే ఎక్కువ ధర పెట్టేందుకు రెడీగా ఉన్నారని అర్థమైపోయింది.

పైగా తండేల్ తెచ్చుకున్న పెంపు వారం రోజులకు మాత్రమే. సో సాధారణ ధరల కోసం ఎదురు చూడాల్సిన సమయం ఎక్కువగా లేదనేది బయ్యర్ల వెర్షన్. ఇది కరెక్టే. రెండు వారాలుగా సరైన రిలీజ్ లేక భోరుమంటున్న థియేటర్లకు తండేల్ ఆక్సిజన్ గా మారాల్సి ఉంది.