చప్పుడు లేని కీర్తి సురేష్ సినిమా

‘మహానటి’తో కీర్తి సురేష్ జాతకమే మారిపోయింది. అంతకుముందు ఆమెను అందరు హీరోయిన్లలో ఒకదాని లాగే చూశారు. కానీ ‘మహానటి’తో ఒకేసారి నటిగా ఎన్నో మెట్లు ఎక్కేసి తన ప్రత్యేకతను చాటుకుంది కీర్తి. ఇక అప్పట్నుంచి ఆమె పేరు మీదే సినిమాలు సేల్ అవుతున్నాయి. కీర్తి ప్రధాన పాత్రలో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మొదలయ్యాయి. అందులో ఒకటి ‘మిస్ ఇండియా’.

తెలుగులో నువ్విలా, 118 లాంటి సినిమాలు నిర్మించిన మహేష్ కోనేరు తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. నరేంద్ర నాథ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. కీర్తి నటించిన పెంగ్విన్, గుడ్ లక్ సఖి చిత్రాల కంటే ముందే ‘మిస్ ఇండియా’ మొదలైంది. వేసవి ఆరంభంలోనే రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా కరోనా వల్ల వెనక్కెళ్లిపోయింది.

ఐతే ఈ లోపు ‘పెంగ్విన్’ పూర్తయి అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైపోయింది. ఆ సినిమాకు విడుదల ముంగిట బాగానే ప్రచారం లభించింది. ఇక ‘గుడ్ లక్ సఖి’ విషయానికి వస్తే దిల్ రాజు ప్రొడక్షన్ కావడం, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేయడం, జగపతిబాబు కీలక పాత్ర చేయడం వల్ల దీనికి ముందు నుంచి మీడియాలో మంచి ప్రాధాన్యమే లభిస్తోంది.

కరోనా తర్వాత షూటింగ్ పున:ప్రారంభించడం, టీజర్ కూడా రిలీజ్ చేయడంతో ఇది తరచుగా వార్తల్లో ఉంటోంది. కానీ ‘మిస్ ఇండియా’ గురించి అసలు చప్పుడు లేదు. దీని గురించి ఒక అప్ డేట్ లేదు. మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ పబ్లిసిటీ లేదు. అసలు సినిమా పూర్తయింది లేనిది కూడా తెలియట్లేదు. ఓటీటీ రిలీజ్ అన్నారు కానీ.. దాని గురించి కూడా సమాచారం లేదు. కీర్తి కూడా ఎప్పుడూ ఈ సినిమా ఊసే ఎత్తట్లేదు. దీన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకుంటే.. ముందు నుంచి వార్తల్లో నిలబెట్టి జనాల్లో ఆసక్తి రేకెత్తించడం చాలా అవసరం. మరి దీని మేకర్స్ ఈ సినిమాను ఎందుకు అలా మరుగున పడేశారన్నది అర్థం కాని విషయం.