హీరో మార్కెట్ పెరిగింది.. ఆ స్క్రిప్టు బయటికి

యువ కథానాయకుడు రామ్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ తర్వాత ‘గరుడవేగ’ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ఒక సినిమాను అనౌన్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ టీం అంతా సినిమా ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంది. కానీ ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లకుండానే ఆగిపోయింది. అందుక్కారణం బడ్జెట్ సమస్యలే అని అప్పుడు వార్తలొచ్చాయి.

రాజశేఖర్ మార్కెట్ గురించి పట్టించుకోకుండా ‘గరుడవేగ’ను భారీ బడ్జెట్లో తీశాడు ప్రవీణ్. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా సరే.. ఓవర్ బడ్జెట్ వల్ల కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. రామ్‌తో అతను చేయాలనుకున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు సైతం బడ్జెట్ లెక్కలు ఘనంగా ఉండటంతో ఇది వర్కవుట్ కాదని రవికిషోర్ పక్కన పెట్టేశారని గుసగుసలు వినిపించాయి.

కట్ చేస్తే ప్రవీణ్ ఇంకో రెండేళ్లు సినిమా చేయకుండా ఖాళీగా ఉన్నాడు. పుల్లెల గోపీచంద్ బయోపిక్ అన్నారు కానీ.. అది ఎంతకీ తెగలేదు. ఈ మధ్యే అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ దర్శకత్వంలో ఒక సినిమాను అనౌన్స్ చేశారు. కానీ అది పక్కాగా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందో తెలియదు. కాగా రామ్‌, ప్రవీణ్ కాంబినేషన్లో ఇంతకుముందు సెట్ అయిన ప్రాజెక్టును ఇప్పుడు మళ్లీ బయటికి తీసే ప్రయత్నం జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రవీణ్ సినిమా ఆపేశాక రామ్ చేసిన ‘హలో గురూ ప్రేమ కోసమే’ హిట్టయింది.

గత ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్’తో అతను బ్లాక్‌బస్టర్ విజయాన్నందుకున్నాడు. ఈ సినిమాతో అతడి మార్కెట్ ఎంతో పెరిగింది. దీని తర్వాత చేసిన ‘రెడ్’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. దానికి మంచి బిజినెస్ కూడా జరిగింది. దీంతో రవికిషోర్‌కు రామ్-ప్రవీణ్ సినిమా మీద పెద్ద బడ్జెట్ పెట్టడానికి ధైర్యం వచ్చిందట. రామ్, ప్రవీణ్ కమిట్మెంట్లను చూసుకుని ఈ సినిమాను కుదిరినపుడు పట్టాలెక్కించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.