ప్రభాస్ సినిమాలో అమితాబ్‌ది అలాంటి పాత్రేనా?

‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే కొత్త సినిమా గురించి మరో పెద్ద అప్‌డేట్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. ఇప్పటికే దీపికా పదుకునే లాంటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఈ చిత్రానికి కథానాయికగా ఎంపికైంది. ఇప్పుడు అమితాబ్ వచ్చి చేరడంతో ఈ ప్రాజెక్టు రేంజ్ ఇంకా పెరిగింది. ఇది ట్రూ పాన్ ఇండియా సినిమా కాబోతోందన్నది స్పష్టం.

అమితాబ్ బచ్చన్‌‌ను పది మంది దర్శకులు సంప్రదిస్తే.. అందులో ఒకటి రెండుకు మించి ఆయన ఎంచుకోరు. ఇప్పటికీ అంత డిమాండ్ ఉందాయనకు. గతంలో నందమూరి బాలకృష్ణ-కృష్ణవంశీ కలయికలో ఓ సినిమాలో ఐదు నిమిషాల పాత్ర కోసం అడిగితే.. డేట్లు ఇవ్వలేకపోయారాయన. ఆయన ఆ పాత్ర చేయలేదని ఆ సినిమానే ఆపేసింది చిత్ర బృందం. దీన్ని బట్టి అమితాబ్ సినిమాల ఎంపికలో ఎంత కచ్చితంగా ఉంటారో తెలిసిందే.

గత ఏడాది చిరంజీవి మీద ఉన్న అభిమానంతో ‘సైరా’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించిన అమితాబ్.. ఇప్పుడు మాత్రం సినిమా స్కేల్, పాత్ర నచ్చే ప్రభాస్ మూవీని ఓకే చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాలో అమితాబ్ పాత్ర ఏమై ఉంటుందన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘ఆదిత్య 369’ తరహా ఫాంటసీ టచ్ ఉన్న సైంటిఫిక్ థ్రిల్లర్ తీయబోతున్నట్లు నాగ్ అశ్విన్ ఇంతకుముందే సంకేతాలు ఇచ్చాడు.

‘ఆదిత్య 369’ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును ఈ చిత్రానికి మెంటార్‌గా కూడా పెట్టుకున్నారు. ఆయన తయారు చేసిన ‘ఆదిత్య 999’ (369 సీక్వెల్) కథనే కొంచెం మార్చి తీయబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒరిజినల్లో టినూ ఆనంద్ పోషించిన సైంటిస్ట్ పాత్రను అమితాబ్ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అలాంటి పాత్ర అయితే అమితాబ్‌కు భలేగా సెట్టయ్యే అవకాశముంది. చూద్దాం మరి బిగ్-బిని నాగ్ అశ్విన్ ఎలా ఉపయోగించుకుంటాడో?