పుష్ప జోరుని కర్ఫ్యూలు ఆపగలవా

నవంబర్ 28 దాకా హైదరాబాద్ లో కర్ఫ్యూ విధిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం బన్నీ అభిమానులకు శరాఘాతమే అయ్యింది. ఎందుకంటే పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ స్థాయిలో నిర్వహిస్తారని ఎదురు చూస్తున్న వాళ్ళ ఆశలకు గండి పడింది. అయితే ఇక్కడ టెన్షన్ పడేందుకు ఏమీ లేదు. భాగ్యనగరంలో వేడుక జరగనంత మాత్రాన హైప్ ఏం తగ్గిపోదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ మైత్రి సంస్థ భారీ ఎత్తున ఈవెంట్లు ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, మహారాష్ట్రను టార్గెట్ చేసుకుని నెవర్ బిఫోర్ అనిపించేలా ప్రణాళికలు రెడీ అవుతున్నాయి.

సో ఎక్కడ చేసినా లైవ్ లో ఫ్యాన్స్ చూస్తారు. ప్రత్యక్షంగా బన్నీని కలుసుకోవాలనుకునే వాళ్ళు ఏపీకి వచ్చి కోరికను తీర్చుకుంటారు. పోనీ హైదరాబాద్ ఏదైనా ఫంక్షన్ హాల్ లో చేద్దామన్నా ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే నోవాటెల్ లో తలపెట్టిన దేవర ఈవెంట్ కి ఏం జరిగిందో ఎవరూ మర్చిపోలేదు. విపరీతమైన రద్దీ నియంత్రించలేక మొదలుపెట్టక ముందే ఆపేశారు. దీంతో ఈసారి పర్మిషన్లు ఎవరు అడిగినా ఇచ్చే ప్రసక్తే ఉండదు. దానికి తోడు కర్ఫ్యూ అంటే ఆంక్షలు చాలా కఠినంగా ఉంటాయి. చిన్న హీరోలు ఇన్ డోర్ లో చేసుకుంటే ఇబ్బందులు రావు. కానీ బన్నీ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ కి అలా కుదరదు.

తెలంగాణలో ఈవెంట్ చేసినా చేయకపోయినా పుష్ప 2కి వచ్చే ఫరక్ ఏమి ఉండదన్న కామెంట్స్ లో నిజం లేకపోలేదు. ఇప్పటికే సరిపడా హైప్ తో వెయ్యి కోట్ల బిజినెస్ తో ఆల్ ఇండియా లెవెల్ లో హాట్ టాపిక్ అయ్యింది. బ్లాక్ బస్టర్ టాక్ కాదు ఎబోవ్ యావరేజ్ అనిపించుకున్నా వసూళ్ల ఊచకోత ఖాయమే. అసలైన ట్రైలర్ ఇంకా రానేలేదు. అది వచ్చాక అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోవడం ఖాయం. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం బ్యాలన్స్ వర్క్ తో పాటు ఐటెం సాంగ్ ప్లానింగ్ లో ఉన్నారు. ఈ రెండూ అయిపోతే పబ్లిసిటీ ఎలా చేయాలనే దానిమీద సీరియస్ ఫోకస్ పెడతారు. అక్కడి నుంచి నాన్ స్టాపే.