‘కంగువ’ కథ నాకోసమే రాశారేమో-రజినీ

ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నెక్స్ట్ బిగ్ రిలీజ్ అంటే.. ‘కంగువ’నే. సూర్య హీరోగా ‘శౌర్యం’ ఫేమ్ శివ రూపొందించిన ఈ చిత్రం నవంబరు 14న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇది బేసిగ్గా తమిళ మూవీ అయినా.. తెలుగు, హిందీలో సైతం ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కొంచెం ముందుగానే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి పూర్తిగా ప్రమోషన్ల మీద దృష్టిపెట్టింది టీం.

ఆల్రెడీ హైదరాబాద్‌లో ఈవెంట్ చేశారు. తాజాగా చెన్నైలో తమిళ వెర్షన్ ఆడియో వేడుక జరిగింది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా రావాల్సింది. కానీ ఆయన ‘కూలీ’ షూటింగ్‌లో బిజీగా ఉండడంతో రాలేకపోయారు. కానీ టీం కోసం ఒక వీడియో సందేశాన్ని పంపించారు. అందులో రజినీ సరదాాగా మాట్లాడారు.

శివతో రజినీకాంత్ ‘అన్నాత్తె’ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ శివతో రజినీకి మంచి అనుబంధమే ఉంది. ‘అన్నాత్తె’ చేసేటపుడు మనిద్దరం కలిసి ఒక పీరియడ్ మూవీ చేస్తే బాగుంటుందని చెప్పేవాడినని.. బహుశా తన కోసమే అతను ‘కంగువ’ కథ రాసి ఉంటాడని.. చివరికి అది సూర్య, జ్ఞానవేల్ రాజాల దగ్గరికి చేరిందని ఆయన నవ్వుతూ అన్నారు.

‘కంగువ’ ట్రైలర్ అద్భుతంగా ఉందని.. సూర్య గొప్ప నటుడని, అతడికి మంచి విజయం చేకూరాలని రజినీ ఆకాంక్షించారు. నిజానికి ‘కంగువ’ దసరా కానుకగా అక్టోబరు 10న విడుదల కాావాల్సింది. కానీ రజినీ సినిమా ‘వేట్టయన్’ను దసరాకే రిలీజ్ చేయాలని భావించడంతో రజినీ మీద గౌరవంతో తమ చిత్రాన్ని సూర్య అండ్ కో వాయిదా వేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ‘కంగువ’ ఆడియో వేడుకకు రజినీ ముఖ్య అతిథిగా రావాలనుకున్నారు. కానీ ఇటీవలే అనారోగ్యం కారణంగా కొన్ని వారాల పాటు ఇంటికే పరిమితమైన సూపర్ స్టార్.. కొన్ని రోజుల నుంచి ‘కూలీ’ చిత్రీకరణకు హాజరవుతున్నారు. అందులో బిజీగా ఉండడంతో ‘కంగువ’ టీంను విష్ చేస్తూ రజినీ వీడియో పంపించారు. ఆయన ఇలా చేయడం అరుదు.