స్పిరిట్.. ఒక్క మాట చెప్పగానే ట్రెండింగ్

ప్రభాస్.. ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్. ప్రభాస్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మినిమం 500 కోట్ల వసూళ్లు వస్తాయి. వెయ్యి కోట్ల వసూళ్లు అందుకోవడం కూడా ప్రభాస్‌కు పెద్ద కష్టం కాదు. ఇక సందీప్ రెడ్డి వంగ ఏమో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. హీరో ఎవరైనా తన పేరు మీద వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది సినిమాకు.

‘యానిమల్’ మూవీ 900 కోట్ల వసూళ్లు సాధించిందంటే అందులో మేజర్ క్రెడిట్ సందీప్‌దే. అలాంటి హీరో, ఇలాంటి దర్శకుడు కలిసి సినిమా చేస్తే దానికి ఆకాశమే హద్దు. వీరి కలయికలో ‘స్పిరిట్’ అనే సినిమా రాబోతున్నట్లు రెండేళ్ల కిందటే ప్రకటించారు. కానీ ఇద్దరికీ వేర్వేరు కమిట్మెంట్లు ఉండడంతో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలు కావచ్చని అంచనా.

ఐతే ‘స్పిరిట్’ గురించి నిన్న ‘పొట్టేల్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో సందీప్ రెడ్డి చిన్న ప్రస్తావన చేశాడో లేదో.. ఒక రోజంతా ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘స్పిరిట్’ ఎలాంటి సినిమా అని యాంకర్ సుమ అడిగితే.. ‘పోలీస్ స్టోరీ’ అంటూ ఒక పలక మీద రాసి చూపించాడు సందీప్ రెడ్డి. ఈ సినిమా పోలీస్ కథతో తెరకెక్కబోతోందని ఇంతకుముందే మీడియాలో ప్రచారం జరిగింది. సందీప్ ఆ విషయాన్ని ఇప్పుడు ధ్రువీకరించాడు.

ఏ పాత్రనైనా ఇంటెన్స్‌గా చూపించి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడని పేరున్న సందీప్ రెడ్డి.. పోలీస్ కథతో సినిమా తీస్తున్నాడు, అందులో ప్రభాస్ హీరో అంటే రెబల్ ఫ్యాన్స్‌ ఎగ్జైట్మెంట్ ఏ లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పోలీస్ పాత్ర చేయడానికి తగ్గ సూపర్ కటౌట్ ఉన్నప్పటికీ ప్రభాస్ ఇప్పటిదాకా ఆ రోల్ చేయలేదు. ఇప్పుడు సందీప్ లాంటి దర్శకుడి సినిమాలో పోలీస్ పాత్ర చేశాడు అంటే బాక్సాఫీస్ విధ్వంసం చూడబోతున్నట్లే.