జంతువుల ప్రపంచంలో మహేష్ సాహసాలు

ఎప్పుడెప్పుడాని ఎదురు చూసే కొద్దీ ఆలస్యమవుతూ ఉత్సుకతను అంతకంతా పెంచుకుంటూ పోతున్న మహేష్ బాబు రాజమౌళి కలయికలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీకి అడుగులు దగ్గర పడుతున్నాయి. డిసెంబర్ లో ప్రకటన ఇచ్చి జనవరి నుంచి లాంఛనంగా షూటింగ్ మొదలుపెట్టే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుగా దీని మీద అనౌన్స్ మెంట్ టైం నుంచే అంచనాలు మొదలయ్యాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న ఇమేజ్ ఆస్కార్ నుంచి జపాన్ వీధుల దాకా ప్రతిచోటా మారుమ్రోగిపోవడంతో ఎస్ఎస్ఎంబి 29 బిజినెస్ కి ఆకాశమే హద్దుగా మారబోతోంది.

ఈ కథ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతుందని గతంలో లీక్ వచ్చింది కానీ పూర్తి స్థాయి వివరాలు అందుబాటులోకి రాలేదు. తాజాగా ఒక ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ లో రాజమౌళి మాట్లాడిన మాటలు వైరలవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ జంతువులను ఎస్ఎస్ఎంబి 29లో వాడబోతున్నానని చెప్పడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ రెట్టింపయ్యింది. ట్రిపులార్ ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ లో జూనియర్ ఎన్టీఆర్ వ్యాను బోనులో జంతువులను దించుతూ ఎగిరే సీన్ ఏ స్థాయిలో పేలిందో చూశాం. ఇంట్రో టైగర్ ఫైట్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు ఏకంగా జంతు ప్రపంచం అంటే మాస్ పిచ్చెక్కిపోవడం ఖాయం.

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఇండియానా జోన్స్ ని విపరీతంగా ఇష్టపడే రాజమౌళి అలాంటి బ్యాక్ గ్రౌండ్ నే మహేష్ కోసం వాడబోతున్నట్టు తెలిసింది. అడవులు, జంతువులు, నిధి నిక్షేపాలు, ఒళ్ళు జలదరించే హీరో విలన్ల విన్యాసాలు, అబ్బురపరిచే కొండలు కోనలు ఒకటి రెండు కాదు ఇప్పటిదాకా వచ్చిన ఈ సిరీస్ లోని అయిదు సినిమాల్లో గత ఏడాది రిలీజైన చివరిది తప్ప అన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చాయి. విజయేంద్ర ప్రసాద్ ఆలోచనకు రాజమౌళి టేకింగ్ తోడై దానికి ఆస్కార్ విజేత కీరవాణి ఇచ్చే ఎలివేషన్లు సరిగ్గా కుదిరితే థియేటర్ల జాతర గురించి ఊహించుకోవడం కూడా కష్టమే.