ధర్మా ప్రొడక్షన్స్ డీల్ వెనుక స్టోరీ ఏంటి

బాలీవుడ్ అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరున్న ధర్మా ప్రొడక్షన్స్ లో 50 శాతం వాటాని సీరమ్ ఇన్స్ టిట్యూట్ అధినేత అదర్ పూనావాలాకు అమ్మేయడం విపరీతమైన హాట్ టాపిక్ గా మారింది. నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఇంత పెద్ద బ్యానర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు ఏముంటాయనే ఆసక్తి సగటు ప్రేక్షకుల్లో ఉండటం సహజం. ముంబై వర్గాల నుంచి భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. ధర్మా సంస్థకు గత కొన్నేళ్లుగా అధిక శాతం డిజాస్టర్లు పడ్డాయి. బ్రహ్మాస్త్ర పార్ట్ 1, రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని లాంటి ఒకటి రెండు మినహాయిస్తే మిగిలినవి థియేట్రికల్ గా తీవ్ర నష్టాలు తెచ్చాయి.

ఒకప్పుడు కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషి కభీ గం, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ అఫ్ ది ఇయర్, ఏ జవానీ హై దివాని లాంటి రికార్డులు సృష్టించిన బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ట్రాక్ రికార్డు నుంచి ఇప్పటి స్థాయికి ధర్మా ప్రొడక్షన్స్ తగ్గడం కలవరపరిచే విషయమే. ఇటీవలే వచ్చిన అలియా భట్ జిగ్రా సైతం ఫ్లాపుల లిస్టులోకి చేరిపోయింది. అంతకు ముందు మిస్టర్ అండ్ మిస్ మహీ, యోధా, గోవిందా మేరా నామ్, సెల్ఫీ, లైగర్, భూత్ 1 హాంటెడ్ షిప్, డ్రైవ్, కళంక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉన్నాయి. 2018లో వచ్చిన రాజీ తర్వాత ఆ స్థాయిలో యునానిమస్ హిట్ అనిపించుకున్న మూవీ ధర్మాకు లేకపోయింది.

కిల్ లాభాలు ఇచ్చినా దాని స్థాయికి తగ్గట్టు ఆడింది తప్పించి వందల కోట్లు వచ్చి పడలేదు. 1000 కోట్లకు వాటా ఇచ్చారంటే చిన్న విషయం కాదు. కరణ్ జోహార్ సగ భాగం తన భాగస్వామ్యంలో ఉంచుకున్నప్పటికీ ఇకపై ఉమ్మడి నిర్ణయాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అవి ప్రొడక్షన్ అయినా ఓటిటి డీల్స్ ఏదైనా సరే. ఏది ఏమైనా గొప్ప చరిత్ర కలిగిన ప్రొడక్షన్ హౌసెస్ ఇలా బయట వ్యక్తుల పెట్టుబడులు తీసుకునే పరిస్థితి రావడం చూస్తే బాక్సాఫీస్ ఆట ఎంత నిర్దయగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా కరణ్ కు ఈ డీల్ మంచిదే కావొచ్చు కానీ బ్రాండ్ సింహాసనం ఇంకొకరితో పంచుకోవాలిగా.