ఒక షెడ్యూల్‌ అయ్యాక రకుల్‌ను తీసేసి..

టాలీవుడ్లో ఒకప్పుడు కథానాయికగా ఒక వెలుగు వెలిగింది ముంబయి భామ రకుల్ ప్రీత్. 2013లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో కథానాయికగా పరిచయమై సూపర్ హిట్ అందుకున్న రకుల్.. చూస్తుండగానే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2015-16 టైంలో ఆమె నంబర్ వన్ హీరోయిన్‌ అనే గుర్తింపు సంపాదించింది.

జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా టాప్ హీరోలతో ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధృవ’ లాంటి హిట్ సినిమాల్లో నటించి తిరుగులేని స్థాయికి చేరుకుంది. కానీ తర్వాత వరుసగా ఫ్లాపులు పడడంతో ఆమె కెరీర్ డౌన్ అయిపోయింది.

తర్వాత కొన్నేళ్లకు అసలు కనిపించకుండా పోయింది. ప్రస్తుతం తెలుగులో రకుల్‌కు సినిమాలే లేవు. వేరే భాషల్లో కూడా కెరీర్ అంతంతమాత్రంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తన కెరీర్లో జరిగిన తప్పులు, తనకు జరిగిన అన్యాయాల గురించి రకుల్ ఈ మధ్య ఇంటర్వ్యూల్లో ఓపెన్ అవుతోంది.

ఈ క్రమంలోనే తెలుగులో ఓ సినిమాకు తనను కథానాయికగా తీసుకుని.. తర్వాత తప్పించడం గురించి రకుల్ మాట్లాడింది. ‘‘ప్రభాస్‌ సరసన ఓ సినిమాలో నాకు హీరోయిన్‌గా అవకావం వచ్చింది. ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాం. అప్పుడు నేను ఢిల్లీలో చదువుతుండేదాన్ని. షెడ్యూల్ అయ్యాక ఢిల్లీ వెళ్లాను. తర్వాతి షెడ్యూల్ కోసం పిలుస్తారని ఎదురు చూస్తూ ఉన్నా. కానీ ఎన్ని రోజులైనా నాకు కాల్ రాలేదు. నా స్థానంలో కాజల్‌ను తీసుకున్నారని తర్వాత తెలిసింది. వాళ్లిద్దరూ అంతకుముందే ఓ హిట్ మూవీలో నటించారు. దీంతో ఆ జోడీ బాగుంటుందని మళ్లీ తననే తీసుకున్నారు. సినిమా అనేది వ్యాపారం. కాబట్టి దీన్ని తప్పుట్టలేం. కొత్తగా వచ్చిన అమ్మాయిలకు ఇలాంటి అనుభవాలు మామూలే. ఒక సినిమా పోయినా ఇంకోటి వస్తుందనే పాజిటివ్ ఆలోచనతో నేనుంటా’’ అని రకుల్ చెప్పింది.

నెపోటిజం కారణంగా తాను పలు అవకాశాలు కోల్పోయినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో రకుల్ వ్యాఖ్యానించింది.