టికెట్ల రేట్ల‌పై సురేష్ బాబుది వేరే మాట‌

ప్ర‌స్తుతం టాలీవుడ్లో టికెట్ల రేట్ల గురంచి పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. వ‌రుస‌గా పెద్ద సినిమాల‌కు అధిక రేట్లు పెట్టి వారం ప‌ది రోజుల్లోనే పెట్టుబ‌డి అంతా రాబ‌ట్టుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఆల్రెడీ టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచ‌గా.. పెద్ద సినిమాల‌కు తొలి వారం, ప‌ది రోజుల్లో అద‌న‌పు రేట్లు పెట్ట‌డం మీద ప్రేక్ష‌కుల్లో అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య త‌గ్గిపోతుండ‌గా.. అధిక రేట్ల వ‌ల్ల ఇంకా ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ దేవ‌ర మూవీని డిస్ట్రిబ్యూట్ చేసిన స్టార్ ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ మాత్రం పెద్ద సినిమాల‌కు పెడుతున్న రేట్లు స‌బ‌బే అంటూ వాదించారు.

1500 పెట్టి ఒక ఫ్యామిలీ సినిమాను చూడ‌లేదా.. ఆ మొత్తానికి మూడు గంట‌ల పాటు ఎవ‌రిస్తారు ఎంట‌ర్టైన్మెంట్ అంటూ ఆయ‌న ప్ర‌శ్నించ‌డం మీద సోష‌ల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. ఎక్కువ‌మంది నెటిజ‌న్లు ఈ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ నిర్మాత సురేష్ బాబు.. తాజాగా ఒక చ‌ర్చా కార్య‌క్ర‌మంలో టికెట్ల రేట్ల‌ను పెంచ‌డం మీద త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు. థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య అంత‌కంత‌కూ త‌గ్గిపోతున్న మాట వాస్త‌వ‌మే అని ఆయ‌నన్నారు. భారీ బ‌డ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాత‌లు అద‌న‌పు రేట్లు పెడితే త‌ప్ప తాము సేఫ్ అవ్వ‌లేమ‌ని ఆలోచిస్తున్నార‌ని.. ప్ర‌భుత్వం కూడా అందుకు స‌హ‌క‌రిస్తోంద‌ని.. కానీ ప్రేక్ష‌కుల దృష్టికోణం వేరుగా ఉంద‌ని ఆయ‌న‌న్నారు. ఇంత రేటు పెట్టి థియేట‌ర్ల‌కు వెళ్లాలా అని వాళ్లు ఆలోచిస్తున్నార‌న్నారు. టికెట్ల రేట్ల‌తో పాటు పాప్ కార్న్ స‌హా స్నాక్స్ రేట్లు ఎక్కువ ఉన్న‌ట్లు వాళ్లు ఫీల‌వుతున్న‌ట్లు చెప్పారు.

వీక్ డేస్‌లో బుకింగ్ యాప్స్‌లో టికెట్లు కొన‌కుండా నేరుగా థియేట‌ర్ల‌కు వెళ్లి కౌంట‌ర్లో కొంటున్న సంగ‌తిని తాము గుర్తించామ‌ని.. బుకింగ్ కోసం పెట్టే డ‌బ్బును కూడా వేస్ట్ అని ఫీల‌వుతున్నార‌ని ఆయ‌న‌న్నారు. పండుగ‌ల‌ప్పుడు పెద్ద సినిమాలు వ‌స్తే త‌ప్ప ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌ట్లేద‌ని.. చాలా సినిమాల‌కు నాలుగు వారాలు ఆగితే ఓటీటీలో ఫ్రీగా చూసుకోవ‌చ్చ‌నే భావ‌న‌లో ఆడియ‌న్స్ ఉన్నార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రేట్ల విష‌యంలో పున‌రాలోచించాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.