గ‌ణ‌ప‌తి పందిరికి వంద‌ల కోట్ల బీమా

వినాయక చవితి ఉత్సవాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం ముస్తాబవుతోంది. ముంబైలో అత్యంత ”సంపన్న” గణపతి మండపాన్ని గౌడ్ సరస్వత్ బ్రాహ్మిణ్ సేవా మండల్ ఏర్పాటు చేస్తోంది. ముంబై కింగ్ సర్కిల్ ఏరియాలో ఏర్పాటు చేస్తున్న ఈ మంటపాన్ని అక్షరాలా రూ.316.40 కోట్లకు నిర్వాహకులు బీమా  చేశారు. గణేష్ విగ్రహానికి స్వర్ణాభారణాలు, ఇతర విలువైన ఆభరణతో సర్వాంగ సుందరంగా అలంకరించి మరీ జరుపనున్న ఈ ఉత్సవాలకు ఈ నెల 31న జీఎస్‌బీ శ్రీకారం చుడుతోంది. ఈ నేప‌థ్యంలో అగ్ని, చోర భ‌యాల నుంచి ర‌క్ష‌ణ‌గా బీమా చేయించిన‌ట్టు నిర్వాహ‌కులు తెలిపారు.

వినాయక మండపానికి, విలువైన ఆభరణాలకు, సిబ్బందికి…ఇలా అన్నింటికీ వివిధ రకాల ఇన్సూరెన్స్ లను న్యూ ఇండియా ఎస్యూరెన్స్ నుంచి జీఎస్‌బీ సేవా మండల్ తీసుకుంది. మొత్తం బీమా సొమ్ములో స్వర్ణాభరణాలు, వెండి ఆభరణాలు, నగలకు రూ.31.97 కోట్ల బీమా తీసుకున్నారు. రూ.263 కోట్లకు వలంటీర్లు, పురోహితులు, వంటవాళ్లు, పాదరక్షల దుకాణ సిబ్బంది, వాలెట్ పార్కింగ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులకు పెర్సనల్ యాక్టింగ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకుంది.

ఫర్నిచర్, కంప్యూటర్లు, సీసీటీవీ కెమెరాలు, స్కానర్లు, వంటపాత్రలు, గ్రాసరీ, పళ్లు, కూరగాయ‌లు సహా భూకంప రిస్క్ కవర్ తో స్టాండర్స్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్ పాలసీ కింద రూ.కోటి రూపాయల బీమా తీసుకుంది. వేదక ప్రాంతంలో స్పెషల్ పెరిల్ పాలసీ ద్వారా రూ.77.5 లక్షల రిస్క్ కవర్ ఉంటుంది. మండపాలు, స్టేడియం, భక్తులకు రూ.20 కోట్ల మేరకు కవరేజ్ ఉంది.

కిలోల కొద్దీ బంగారం..

మహా గణపతిని 66 కేజీల స్వర్ణాభరణాలు, 295 కేజీలకు పైబడిన వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులతో అలంకరించనున్నట్టు జీఎస్‌బీ సేవా మండల్ తెలిపింది. మట్టితో ఈ మహాగణపతిని రూపొందిస్తున్నారు. 2016లోనూ మహాగణపతి మండపానికి జీఎస్‌బీ సేవా సమితి రూ .300 కోట్లకు బీమా చేసింది. కాగా, ఈ ఏడాది మహాగణపతి ”విరాట్ దర్శన్” ను ఈనెల 29న అట్టహాసంగా జరిపేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.