ఎవరి వృత్తి పనిలో వారు ధర్మబద్ధంగా ఉంటే సమాజం లో శాంతి నెలకొంటుందని సీబీఐ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ వీ.వీ లక్ష్మీ నారాయణ అన్నారు. నేడు ప్రతిరోజు నేర పూరిత వార్తలుతో దిన పత్రికలు నిండుతున్నాయని ఇందుకు కారణం జాతి తన ధర్మాన్ని కోల్పోతున్న సందర్భం అన్నారు.
హైదరాబాద్, చిక్కడపల్లి లోని త్యాగరాయ గాన సభలో మంగళవారం ఉదయం ‘భగవద్గీతా ఫౌండేషన్’ నిర్వహణ ‘గీతాజయంతి మహోత్సవం’ వేడుక ఆద్యంతం గీతా బంధువుల సమక్షంలో వైభవంగా జరిగింది. గీత స్మరణతో ఆడిటోరియం పులకించింది.
ఈ వేడుక లో ముఖ్య అతిధిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ భారతీయ జీవన విధానం ఆధ్యాత్మికత, శాంతి, సహనం వీటికి దూర మవుతున్న కొద్దీ సమాజంలో అలజడి అసహనం ఎక్కువ అవుతుందన్నారు గీత మార్గనిర్దేశనం చేస్తుందని వివరించారు.
వేదిక పై అతిధులు అందరూ సంయుక్తంగా ప్రపంచపు తొలి ఆంగ్ల సంగీత భరిత భగవద్గీత ఆడియో పోస్టర్ ను ఆవిష్కరించారు
గోవింద పీఠం పీఠాధిపతి పూజ్య శ్రీ శ్రీరామ ప్రియ స్వామి మాట్లాడుతూ అధికారులు,నాయకులు, స్వామీజీ లు ప్రోటోకాల్ తో జన సామాన్యానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భగవద్గీత ఎవరి కర్తవ్యాన్ని వారు పాటించాలని సందేశాన్ని ఇచ్చిందని, గంగాధర్ శాస్త్రి మనసా వాచా కర్మణా గీత సారాన్ని పాటిస్తూ ప్రచారం చేస్తున్నారని అభినందించారు.
గాన సభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి మాట్లాడుతూ సినీ జర్నలిస్ట్ గా అపర ఘంటసాలగా ఒకనాడు పేరు గడించిన గంగాధర్ శాస్త్రి గీత ఫౌండేషన్ స్థాపించి జీవితమంతా గీతాప్రచారం కు అంకితంకావటం విశేషమన్నారు. ఈ సందర్భంగా వై.రామకృష్ణ కు గీతాచార్య పురస్కారం, చి|| జి.నాగఅనిష్కకు పార్ధ పురస్కారం, చి|| కలగ అచ్యుతశర్మ కు గీత బాల మేధావి పురస్కారం అతిధులు బహుకరించారు.
అనంతరం భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎల్. వి. గంగాధర శాస్త్రి కృష్ణ భజన, గీతామృతంను మధుర గళంతో గానం చేస్తూ స్ఫూర్తి వంతగా వ్యాఖ్యానం చేసి శ్రోతలను ఆకట్టుకున్నారు,గీతా సందేశం ను అందించారు. కార్యక్రమానికి ముందు త్యాగరాయ గానసభ ఆవరణలో గోపూజ నిర్వహించారు. శ్రీమతి క్రాంతి నారాయణ్ ప్రదర్శించిన శ్రీకృష్ణ నృత్యం ఆహుతులను అలరించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates