వరుణ్ సినిమా హీరోయిన్ని మార్చేశారా?

మెగా కుర్రాడు వరుణ్ తేజ్.. తొలిసారిగా స్పోర్ట్స్ డ్రామాలో నటించడానికి అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం వరుణ్ చాలా కసరత్తులు చేసి, బాడీ మార్చుకుని, బాక్సింగ్ నేర్చుకుని సర్వ సన్నద్ధం అయ్యాడు.

ఐతే ఇక షూటింగ్ మొదలవడమే తరువాయి అనుకున్న సమయంలో కరోనా మహమ్మారి వచ్చి అడ్డం పడింది. కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్‌ను కథానాయికగా అనుకున్నారు. ఆమెను ఎంచుకుంటే సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వస్తుందనుకున్నారు.

కానీ డేట్లు కుదరకో.. ఆమె ఈ సినిమాకు సెట్ అవ్వదనో.. ఇంకో కారణంతోనో ఇప్పుడు ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. సయీ స్థానంలో బెంగళూరు భామ నభా నటేష్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ‘ఇస్మార్ట్ శంకర్’తో తిరుగులేని పాపులారిటీ సంపాదించి, యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నభా అయితేనే ఈ సినిమాకు బాగుంటుందని ఫిక్సయ్యారట.

కాకపోతే వరుణ్ ముందు నభా కొంచెం పొట్టిగా అనిపించొచ్చు. అయినా అడ్జస్ట్ అయిపోవచ్చు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు వెంకటేష్ అలియాస్ బాబీ నిర్మించనున్నాడు. అతడికి నిర్మాతగా ఇదే తొలి సినిమా. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలోనే ఈ చిత్రాన్ని నిర్మించడానికి బాబీ ప్రణాళికలు వేసుకున్నాడు.