లెజెండ్ కావాల్సిన వాడు.. ఇలా నిష్క్రమిస్తున్నాడు

అంబటి రాయుడు.. ఈ పేరు భారత క్రికెట్లో ఓ సంచలనం. ప్రతిభ పరంగా చూస్తే భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఉండాల్సిన వాడు. దిగ్గజ స్థాయిని అందుకోవాల్సిన వాడు. ఒక మోస్తరు స్థాయి క్రికెటర్‌గా నిష్క్రమిస్తుండటం క్రికెట్ అభిమానులకు మింగుడు పడటం లేదు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన అంబటి.. ఇప్పుడు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటున్నాడు.

ఐపీఎల్ 16వ సీజన్ ఫైనలే టోర్నీలో తనకు చివరి మ్యాచ్ అని అతను ప్రకటించాడు. ఇంతకుముందు కూడా ఒకటికి రెండుసార్లు రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించి వెనక్కి తీసుకున్న అతను.. ఈసారి మాత్రం యుటర్న్ ఉండదని స్పష్టం చేశాడు. ప్రస్తుత సీజన్లో ఫైనల్ చేరిన చెన్నై జట్టులో అతను సభ్యుడు. ఆదివారమే గుజరాత్‌తో చెన్నై ఫైనల్ ముగియాల్సింది. కానీ వర్షం వల్ల సోమవారానికి ఫైనల్ వాయిదా పడింది. అంటే ఈ రోజే ప్రొఫెషనల్ క్రికెట్లో రాయుడికి చివరి రోజన్నమాట.

అండర్-19 స్తాయిలోనే అద్భుత ప్రదర్శనతో తన పేరు జాతీయ స్థాయిలో మార్మోగేలా చేసిన క్రికెటర్ అంబటి. ఐతే హైదరాబాద్ క్రికెట్లో రాజకీయాల కారణంగా అతను చాలా ఇబ్బంది పడ్డాడు. శివలాల్ యాదవ్ హెచ్‌సీఏలో చక్రం తిప్పుతున్న రోజుల్లో ఏమాత్రం టాలెంట్ లేని తన కొడుకు అర్జున్ యాదవ్‌ను హైదరాబాద్‌ కెప్టెన్‌గా చేసి రాయుడు ఎదగనీయకుండా చేశాడన్నది బహిరంగ రహస్యమే. దీంతో విసుగెత్తిపోయిన రాయుడు.. ఆవేశ పడి ఐసీఎల్‌కు వెళ్లిపోయాడు. దీంతో బీసీసీఐ నిషేధం పడి కొన్నేళ్ల పాటు కెరీర్ దెబ్బ తింది.

యుక్త వయసులో మంచి ఫాంలో ఉండగా విలువైన సంవత్సరాలు ఐసీఎల్ వల్ల వృథా అయ్యాయి. నిషేధం తొలగిపోయి దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లోకి వచ్చినా.. జాతీయ జట్టులోకి రావడానికి టైం పట్టింది. వచ్చాక కొన్ని అవకాశాలను బాగానే ఉపయోగించుకున్నాడు. వన్డేలు, టీ20ల్లో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. కానీ 2019 ప్రపంచకప్‌కు ముందు తెలుగువాడే అయిన సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అతడికి అన్యాయం చేశాడు.

రాయుడిని కాదని విజయ్ శంకర్ లాంటి అర్హత లేని ఆటగాడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేశాడు. దీంతో రాయుడు తీవ్ర ఆగ్రహంతో రిటైర్మెంట్ ప్రకటించాడు. మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా ప్రపంచకప్ ఆడే అరుదైన అవకాశం కోల్పోయాన్న బాధ అతణ్ని వెంటాడింది. మళ్లీ భారత జట్టులోకి రాలేకపోయాడు. ఐపీఎల్‌లో కూడా అతడి కథ ముగిసిందనే అనుకున్నారు. కానీ చెన్నై తరఫున ఇంకొన్నేళ్లు జట్టులో లీగ్‌లో కొనసాగాడు. తనదైన ముద్ర వేశాడు. చెన్నై యాజమాన్యం, ధోని ప్రోత్సాహంతోనే అతను ఐపీఎల్‌ కెరీర్‌ను పొడిగించుకోగలిగాడు.

చివరికి ఇప్పుడు మొత్తంగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన ఉత్తమంగానే ఉంది. ‘స్టార్లు’గా పేరుండి.. ఎన్నో అవకాశాలు దక్కించుకున్న కేఎల్ రాహుల్ లాంటి వాళ్ల కంటే రాయుడు ఎంతో మెరుగని అతడి ఆట చూసిన వాళ్లెవ్వరైనా ఒప్పుకుంటారు. కానీ అశ్రిత పక్షపాతం, తన ఆవేశం వల్లే కెరీర్ దెబ్బ తింది. లెజెండరీ క్రికెటర్‌గా నిష్క్రమించాల్సిన వాడు.. ఇప్పుడిలా ఓ మోస్తరు స్థాయి ఆటగాడిగా రిటైరవ్వాల్సి వచ్చింది.