మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా టూర్–2025 కోసం భారత్‌కు వచ్చారు. ఈ సాకర్ మాంత్రికుడి పర్యటనతో ఫుట్‌బాల్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. మెస్సీని ఒక్కసారి ప్రత్యక్షంగా చూసేందుకు, ఆయనతో ఫోటో దిగేందుకు అభిమానులు భారీగా ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు.

హైదరాబాద్‌లో మెస్సీతో ఫోటో దిగేందుకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఫీజు నిర్ణయించారు. ఈ అవకాశానికి ఇప్పటికే 60 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. మరోవైపు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్‌ను వీక్షించేందుకు 27 వేల మందికి పైగా టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో భేటీ కానుండటం ఈ ఈవెంట్‌కు మరింత ఆకర్షణగా మారింది.

అదే సమయంలో కోల్‌కతా లేక్‌టౌన్‌లోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన లియోనెల్ మెస్సీ 70 అడుగుల భారీ విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అభిమానుల్లో అపూర్వ ఉత్సాహాన్ని రేకెత్తించింది.

ఈ టూర్‌లో భాగంగా మెస్సీ ప్రత్యక్షంగా మ్యాచ్‌లు ఆడకపోయినా, అభిమానులతో ప్రత్యేక భేటీలు, వర్చువల్ ఈవెంట్లు, ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భారతదేశంలో తనకు ఉన్న అపారమైన అభిమానాన్ని గౌరవిస్తూ ఈ పర్యటనను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.