బాలీవుడ్ రాజకీయాలపై ప్రియాంక హాట్ కామెంట్స్

ప్రపంచ స్థాయిలో అందాల కిరీటం అందుకున్న ప్రతి ఒక్కరూ సినిమాల వైపు చూడాల్సిందే. కానీ ఆ నేపథ్యంతో వచ్చిన ప్రతి ఒక్కరూ సినిమాల్లో సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ లేదు. ఐశ్వర్యారాయ్ తర్వాత బాలీవుడ్లో అలా ఆధిపత్యం చలాయించిన హీరోయిన్.. ప్రియాంక చోప్రానే. కెరీర్ ఆరంభంలో కొంత ఇబ్బంది పడ్డప్పటికీ తర్వాత పెద్ద రేంజికే వెళ్లింది ప్రియాంక.

హాలీవుడ్ సినిమాలు, టీవీ షోల్లో సైతం ఆమె నటించే స్థాయికి ఎదిగింది. చివరికి హాలీవుడ్ నటుడైన నికో జోనాస్‌ను పెళ్లి కూడా చేసుకుంది. ఐతే ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కెరీర్లో ఒక దశలో తాను పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావని.. తనకు వ్యతిరేకంగా చాలామంది కుట్రలు చేశారని వాపోయింది ప్రియాంక.

ఈ కష్టాలపై ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “బాలీవుడ్లో కొందరు నన్ను ఒక మూలకు నెట్టేయడానికి ప్రయత్నించారు. నాకు అవకాశాలు రాకుండా చేయడానికి ఒక గ్రూప్ ఏర్పాటైందని నాకు తెలిసింది. ఒక దశలో సినిమా రాజకీయాలను తట్టుకోవడం నా వల్ల కాదనిపించింది. ఇక లాభం లేదని నేను బాలీవుడ్‌‌కు బ్రేక్ ఇవ్వాలని అనుకున్నా” అని చెప్పింది.

తాను హాలీవుడ్‌కు వెళ్లడం గురించి ప్రియాంక స్పందిస్తూ.. “ప్రస్తుత నా మేనేజర్ అంజులా ఆచార్య ఓ మ్యూజిక్ వీడియోలో నన్ను చూసి మీకు వరల్డ్ మ్యూజిక్ మీద ఆసక్తి ఉందా అని అడిగాడు. నేను ఓకే చెప్పి యుఎస్ వెళ్లాను. అలా ఓ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టా. మంచి మంచి అవకాశాలు వచ్చాయి” అని ప్రియాంక తెలిపింది. ప్రస్తుతం ప్రియాంక చేతిలో ఉన్నవన్నీ దాదాపు హాలీవుడ్ ప్రాజెక్టులే. హిందీలో ‘జీలే జరా’ అనే సినిమా మాత్రం ఆమె చేయాల్సి ఉంది.