ఆది పినిశెట్టి… ఇలా జరిగిందేంటి

టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా తన గ్రాఫ్ మారిపోయింది. అల్లు అర్జున్ కు ధీటుగా నిలబడే ప్రతినాయకుడిగా దర్శకుడు బోయపాటి చూపించిన విధానం ఆ బ్లాక్ బస్టర్లో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత అజ్ఞాతవాసి, వారియర్ లాంటి వాటిలో విలన్ గా చేశాడు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. మళ్ళీ హీరోగా కంటిన్యూ అవుతూ కొన్ని సినిమాలు చేసినా అవేవి వర్కౌట్ కాలేదు. గత ఏడాది వచ్చిన శబ్దం సైతం ఫ్లాపుల లిస్టులోకి చేరిపోయింది. చాలా గ్యాప్ తర్వాత ఆది పినిశెట్టి ఒకేరోజు రెండు సినిమాలతో పలకరించాడు.

నిన్న విడుదలైన అఖండ 2లో మాంత్రికుడు నేత్రగా చేతబడులు చేసే పాత్రలో డిఫరెంట్ గా ట్రై చేశాడు. అయితే మెయిన్ విలన్లు మరో ఇద్దరు ఉండటంతో పాటు నిడివి పరంగా ఆది పినిశెట్టి ఎక్కువ సేపు లేకపోవడం ఫ్యాన్స్ లోటుగా ఫీలయ్యారు. అఖండ 2 కమర్షియల్ సక్సెస్ ఎంతనేది పక్కనపెడితే ఎక్కువ ప్రాధాన్యం ఉంటే కనక ఆది పినిశెట్టికి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ దక్కేది. ఇక రెండోది డ్రైవ్ అనే డబ్బింగ్ మూవీ. ఇది వచ్చిన సంగతే జనాలు గుర్తించలేదు. మెయిన్ సెంటర్స్ లో షోలైతే దక్కాయి కానీ వాటిలో క్యాన్సిల్ కాకుండా ఎన్ని రన్ అయ్యాయో చెప్పడం కష్టం. అంత బలహీన పబ్లిసిటీ జరిగింది.

ఏమైనా ఆది పినిశెట్టి ఈ ఫ్రైడే సంతృప్తికరంగా జరగలేదు. అఖండ 2లో మిగిలినవాళ్లు హైలైట్ అయినంతగా తనకు గుర్తింపు రాలేదన్నది నిజం. అయితే ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్లు మరిన్ని చేయొచ్చనే కాన్ఫిడెన్స్ బాలయ్య సినిమా ఇచ్చింది. ఇకపై ప్రతినాయకుడిగా ఎక్కువ కనిపించేలా ఆది పినిశెట్టి స్పీడ్ పెంచాలి. నవీన్ చంద్ర లాంటి వాళ్ళు ఇలాంటి ప్లానింగ్ తోనే వేగంగా దూసుకెళ్ళిపోతున్నారు. కానీ ఆది మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నాడు. సరైనోడుతో పెద్ద బ్రేక్ ఇచ్చిన బోయపాటి శీను ఇప్పుడీ అఖండ 2లోనూ మెయిన్ విలన్ గా పెట్టి ఉంటే తన గురించి ఎక్కువ మాట్లాడుకునే అవకాశముండేది.