పొగరు హీరో మీద కోట్లు ధారపోశారు

కెజిఎఫ్ తర్వాతే మనకు కన్నడ స్టార్లు మెల్లగా అలవాటు పడుతున్నారు. దీని పుణ్యమాని బడ్జెట్ లు పెంచేసి ఓ మాదిరి మార్కెట్ ఉన్న హీరోలు కూడా ప్యాన్ ఇండియా అంటూ మల్టీ లాంగ్వేజ్ రిలీజులు డిమాండ్ చేస్తున్నారు. ధృవ సర్జ మనకు పెద్దగా పరిచయం లేని పేరు. ఆ మధ్య పొగరు అనే సినిమా వచ్చింది గుర్తుందా. రష్మిక మందన్న హీరోయిన్. కండలు తిరిగిన ఐరావతం లాంటి దేహంతో అందులో ధృవ ఓవర్ మాస్ గా కనిపించిన తీరు బిసి సెంటర్స్ లో పర్వాలేదనిపించుకుంది. గొప్పగా ఆడకపోయినా శరీరమే ఆకర్షణగా శాండల్ వుడ్ లో నెగ్గుకొస్తున్నాడు ధృవ.

ఇతని కొత్త సినిమా మార్టిన్. నిన్న బెంగళూరులో టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు. తెలుగు మీడియాని ప్రత్యేకంగా విమానంలో తీసుకెళ్లి మరీ అతిథులుగా మర్యాదలు చేశారు. అంత బిల్డప్ ఎందుకయ్యా అంటే వీడియో చూస్తే కానీ అర్థం కాలేదు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇందులో మాములు మేకింగ్ లేదు. పాకిస్థాన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిన మార్టిన్ అక్కడ ప్రమాదకరమైన పరిస్థితులను, చూస్తేనే గుండాగిపోయే భీకర ఆకారాల మనుషులను ఎదురుకునే పరిస్థితి వస్తుంది. మాన్స్ టర్ గా చెప్పుకునే మార్టిన్ ఎందుకా వలయంలోకి వెళ్లాడనేది స్టోరీ.

విజువల్స్ నిజంగానే వామ్మో అనిపించేలా ఉన్నాయి. హీరోయిజం ఓవర్ ది బోర్డ్ వెళ్లినట్టు అనిపించినా పఠాన్ ఫలితం చూశాక సరైన రీతీలో చూపిస్తే జనం ఆదరిస్తారని అర్థమైపోయింది కాబట్టి మొత్తానికి సినిమా చూశాక ఎందుకింత ఖర్చు పెట్టారో అర్థమవుతుంది. వేసవి విడుదలని టార్గెట్ చేసుకున్న మార్టిన్ తో తెలుగు తమిళ మార్కెట్ ని ధృవ సర్జ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇతను ఎవరో కాదు. సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కు స్వయానా మేనల్లుడు. దీనికి కథను సమకూర్చింది కూడా ఆయనే. ఏపి అర్జున్ దర్శకుడు. కెజిఎఫ్ సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.