చరణ్ వార్నింగ్ ఎవరిని ఉద్దేశించి

అప్పుడెప్పుడో నాయక్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ విమర్శకులను టార్గెట్ చేస్తూ వెంట్రుకతో సమానమంటూ ఇచ్చిన స్పీచ్ తప్ప రామ్ చరణ్ ఎప్పుడూ మిస్టర్ కూల్ గా ఉంటాడని పేరు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో సైతం తారక్ ఎంత హుషారుగా ఉన్నా ఈ మెగా పవర్ స్టార్ అంత కలివిడిగా కనిపించలేదు. అగ్రెసివ్ గా ఉండడని అభిమానులు చెప్పుకోవడం సోషల్ మీడియాలో చాలా సార్లు జరిగింది. అయితే వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో తన రెగ్యులర్ శైలికి భిన్నంగా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఫ్యాన్స్ ఇది మాకు కావాల్సిన పవరని మురిసిపోతుండగా మిగిలినవాళ్ళు మాత్రం ఆశ్చర్యపోతున్నారు.

చిరంజీవిని ఎవరు ఏమన్నా క్వయిట్(మౌనం)గా ఉంటారని, ఆయన వెనకాల మేమూ అదే ఫాలో అవుతామని, అలా కాదని ఎవరు బడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే క్వయిట్ గా ఉండమని క్వయిట్ గా చెబుతున్నానని స్వీట్ వార్నింగ్ ఇచ్చేశాడు. పవన్ అంటే జనసేన తరఫున రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అధికార పార్టీ నుంచి నిత్యం విమర్శలు వస్తూనే ఉంటాయి కానీ ఈ మధ్య చిరుని అదే పనిగా లాగుతున్న వాళ్ళు లేకపోలేదు. వైకాపా మంత్రి రోజా కొద్దిరోజుల క్రితం మెగా బ్రదర్స్ ఎలాంటి సేవ చేయడంలేదని చెప్పడం ఆ వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవ్వడం తెలిసిందే.

ఇది సరిపోక వీళ్ళ కుటుంబానికి చిన్న ఆర్టిస్టులు భయపడతారని చేసిన కామెంట్లు మరోసారి అగ్గిని రాజేశాయి. ఇదంతా దృష్టిలో పెట్టుకునే చరణ్ ఇలా ఓపెన్ గా హెచ్చరిక చేశాడని అనిపిస్తోంది. ఎందుకంటే బాబాయ్ పవన్ కి ఈ సపోర్ట్ అవసరం లేదు. మాటకు మాటా ఆయనే పవర్ ఫుల్ కౌంటర్లు ఇస్తాడు. ఎటొచ్చి సైలెంట్ గా ఉండేది చిరంజీవే కాబట్టి ఇలా వారసుడు మద్దతుగా నిలబడాల్సి వచ్చిందన్న మాట. వీరయ్య విజయం పట్ల తండ్రోత్సాహం చరణ్ లో కనిపిస్తోంది. ప్రతికూల గాలులు వీస్తున్న టైంలో చిరు ఇంత పెద్ద హిట్టు కొట్టడం కన్నా ఆనందం ఏముంటుంది.