అట్లాస్ సైకిల్.. ఇక కనిపించదు

అట్లాస్ సైకిల్.. అది కేవలం సైకిల్ కాదు. ఒక ఎమోషన్. భారతీయ ప్రజల జీవనంలో భాగం అయిపోయిన వస్తువది. ఇండియాలో సైకిల్ బ్రాండ్లలో అత్యంత ఆదరణ ఉన్న అట్లాస్.. ఇప్పుడు కనుమరుగు కానుంది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక అట్లాస్ సైకిల్ ఉండేది. ఐతే మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ఈ సైకిల్ బ్రాండ్ ఉత్పత్తిని ఆపేస్తున్నారు.

సైకిళ్లకు అసలు గిరాకీ లేకపోవడం, తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో తమ మానుఫ్యాక్చరింగ్ ప్లాంటును మూసి వేస్తున్నట్లు అట్లాస్ కంపెనీ ప్రకటించింది. దీంతో ఆ ప్లాంటులో పని చేస్తున్న 700 మంది ఉద్యోగాలు కోల్పోయారు.

కొన్నేళ్ల నుంచే అట్లాస్ సహా అన్ని బ్రాండ్ల సైకిళ్ల అమ్మకాలు పడిపోయాయి. అయినా పరిమిత లాభాలతో కంపెనీని నడిపిస్తున్నారు. కానీ కరోనా దెబ్బకు పూర్తిగా అమ్మకాలు ఆగిపోయి ఉద్యోగుల జీతాలు, మెయింటైనెన్స్ కష్టమైపోవడం, కంపెనీ నష్టాల పాలవడంతో ప్లాంటును మూసి వేయక తప్పలేదు.

ఇప్పుడంటే అందరూ బైకులు, కార్లకు బాగా అలవాటు పడిపోయి అవి లేకుండా జీవనం సాగించలేకపోతున్నారు కానీ… ఒక పదిహేనేళ్ల కిందట అయితే సైకిలే మధ్య తరగతికి ప్రధాన వాహనంగా ఉండేది. పిల్లలు, పెద్దలు అందరూ సైకిలే ఉపయోగించేవారు. ప్రతి ఇంట్లో ఒక సైకిల్ కచ్చితంగా ఉండేది. ముఖ్యంగా పల్లెటూళ్లు, చిన్న పట్టణాల్లో సైకిల్ లేకుండా ఏ కుటుంబమూ నడిచేది కాదు.

అప్పట్లో సైకిళ్లకు ఉన్న డిమాండే వేరు. సైకిళ్ల అమ్మకాలతో ఎన్నో దుకాణాలు నడిచేవి. అలాగే సైకిల్ రిపేర్ షాపులు ఇబ్బడిముబ్బడిగా కనిపించేవి. కానీ గత 15 ఏళ్లలో పరిస్థితులు మారుతూ వచ్చాయి. జనాల ఆదాయం పెరిగింది. సైకిల్ విడిచిపెట్టి బైకులకు వెళ్లిపోయారు. సైకిల్‌ను చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు. దాన్ని తొక్కి గమ్య స్థానాలకు వెళ్లేంత ఓపిక జనాలకు లేకపోయింది. దీంతో సైకిళ్ల అమ్మకాలు బాగా పడిపోయి.. ఇప్పుడు సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ల నుంచి అన్నీ మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.