బెంగాల్లో భయపడిన బీజేపీ

పశ్చిమబెంగాల్లో బీజేపీ భయపడిందా ? అవుననే సమాధానం వస్తోంది. అయితే భయపడింది అసెంబ్లీ ఎన్నికల విషయంలో కాదులేండి. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ విషయంలో. దేశంలోని ప్రభుత్వరంగంలో ఉన్న ఉక్కు పరిశ్రమలను ప్రైవేటీకరించటమో లేకపోతే మూసేయటమే చేయాలని కేంద్రం ఇప్పటికే డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. నూతన విధానంలో భాగంగా వైజాగ్ స్టీల్స్ ను ప్రస్తుతానికి ప్రైవేటీకరిచాంలని నరేంద్రమోడి సర్కార్ డిసైడ్ చేసింది. ఒకవేళ ప్రైవేటీకరించటం సాధ్యం కాకపోతే మూసేయాలని కూడా డిసైడ్ చేసింది.

పై రెండు పద్దతుల్లో దేన్ని కేంద్రం అమలు చేస్తుందనే విషయంలో సస్పెన్సు నడుస్తోంది. కేంద్ర నిర్ణయంపై వైజాగ్ లో ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోవటం లేదు. మరి ఇదే నిర్ణయం తీసుకున్న దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం తన నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేసింది. తమిళనాడులోని సేలం స్టీలు, కర్నాటకలోని భద్రావతి, బెంగాల్లోని దుర్గాపూర్ స్టీల్ ఫ్యాక్టరీల విషయంలో కూడా పై రెండు పద్దతుల్లో ఏదో ఒకటి అమలు చేయాలని అనుకున్నది.

భద్రావతిలో స్టీల్ ఫ్యాక్టరిని ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించేయాలని కేంద్రం ఎప్పుడో డిసైడ్ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తు అక్కడి ఉద్యోగులు, కార్మికులు నాలుగేళ్ళుగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదు. ఇక సేలంలోని స్టీల్ ఫ్యాక్టరీని అమ్మేయటానికి మార్చి 31వ తేదీని డెడ్ లైన్ గా పెట్టుకుంది. అమ్మటం కుదరకపోతే మూసేయాలని కూడా డిసైడ్ చేసింది.

ఒడిస్సాలోని నీలాచల్ స్టీల్ ఫ్యాక్టరీని మూసేసింది. జీతాలు కూడా అందక అక్కడి ఉద్యోగులు, కార్మికులు నానా అవస్తలు పడుతున్నారు. ఇక మిగిలింది దుర్గాపూర్ ఫ్యాక్టరి. అయితే బెంగాల్లో జరగబోతున్న ఎన్నికల కారణంగానే నిర్ణయాన్ని వాయిదా వేసింది. సరిగ్గా ఎన్నికల ముందు దుర్గాపూర్ స్టీల్స్ ను అమ్మేయటమో లేకపోతే మూసేయటమో చేస్తే దాని ప్రభావం ఎన్నికల్లో కనబడుతుందని నరేంద్రమోడి భయపడినట్లున్నారు.

అసలే బెంగాల్లో గెలుపును మోడి, అమిత్ షా చాలా ప్రిస్టేజిగా తీసుకున్నారు. బీజేపీ ఎన్నిరకాలుగా మమతా బెనర్జీని ఇబ్బందులు పెడుతున్నా ఆమె అంతే ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో సర్వేల్లో మమత హ్యట్రిక్ కొట్టడం ఖాయమని తేలింది. దాంతో బెంగాల్ వరకు తమ ‘ప్రైవేటు’ నిర్ణయాలను కేంద్రం వాయిదా వేసింది. మొత్తానికి ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే బీజేపీ ఇక్కడ గెలిచినా, ఓడినా దుర్గాపూర్ విషయంలో తన నిర్ణయాన్ని మోడి అమల్లోకి తేవటం ఖాయం.