హిందూపురంలో తేలిన పరిపూర్ణానంద స్వామి !

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం అధ్యక్షుడు పరిపూర్ణానంద స్వామి హిందూపురం లోక్ సభ, శాసనసభ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురం లోక్ సభ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేయాలని ఆశించారు. ఆ స్థానం బీజేపీకి ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించారు. దీంతో పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.

గతంలో శ్రీరాముడి గురించి కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు సిద్దమయ్యాడు. ఆ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయనను గృహనిర్భంధం చేశారు. మూడు రోజుల పాటు ఆయన గృహ నిర్బంధంలో ఉన్నాడు.

2017 నవంబరులో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద చేసిన ప్రసంగంపై ఫిర్యాదులు రావడంతో ఆరునెలల పాటు పోలీసులు నగర బహిష్కరణ చేశారు. ఆ తర్వాత హైకోర్టు పోలీసులు విధించిన నగర బహిష్కరణను ఎత్తివేసింది.

ఆ తర్వాత ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరి 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేశాడు. ఆ ఎన్నికల తర్వాత ఆయన కనుమరుగయ్యారు. ఇన్నాళ్లకు ఆంధ్రాలో హిందూపురం ఎన్నికల తెర మీదకు వచ్చారు.