ఏపీలో ఎవ‌రు గెలుస్తారో.. జోస్యం చెప్పిన కేసీఆర్‌!

తెలంగాణ‌లో త‌న పార్టీ ప‌రిస్థితి, త‌న నేత‌ల ప‌రిస్థితి.. నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్నా.. మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం మెర‌మెచ్చు మాట‌లు మాన‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ‌లో జ‌రుగుతున్న పార్ల‌మెంటు ఎన్నిక‌లు కేసీఆర్‌కు అత్యంత కీల‌కం. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌రువు పోయి.. అధికారం నుంచి దిగిపోయి ఉన్న ప‌రిస్థితి నాయ‌కుల వ‌రుస జంపింగుల‌తో పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారింది. ఇలాంటి ప‌రిస్థితిలో అధినాయ‌కుడు ముందు ఇల్లు చ‌క్క‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు.

కానీ, కేసీఆర్ దుస్సాహ‌సి! ఎక్క‌డ ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆయ‌న‌కు బాగా తెలుసు. స‌రిగ్గా ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చారం కీల‌క ద‌శ‌లో ఉండ‌గా(చంద్ర‌బాబు-ప‌వ‌న్‌-పురందేశ్వ‌రి) కూట‌మికి అనుకూల ప‌వ‌నాలు మొద‌ల‌వుతున్న స‌మ‌యంలో అనూహ్యంగా కేసీఆర్ బ‌రిలోకి దిగిపోయారు. త‌న‌కు సంబంధం లేదంటూనే ఆయ‌న ఏపీ ఎన్నిక‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో మ‌ళ్లీ ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌నే విష‌యంపై కేసీఆర్ స్పందించారు. మ‌రోసారి జ‌గ‌నే అధికారంలోకి వ‌చ్చేస్తార‌ని చెప్పారు. అంతేకాదు.. త‌న‌కు ఉన్నగ‌ట్టి స‌మాచారంగా ఆయ‌న పేర్కొన్నారు.

ఇంత‌లోనే ఏమ‌నుకున్నారో..ఏమో.. ఎవ‌రు గెలిస్తే.. మాకేంటి? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. త‌మ‌కు ఎవ‌రితోనూ సంబంధాలు లేవన్నారు. ఏపీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పార్టీ కానీ, నాయ‌కులు కానీ, జోక్యం చేసుకోర‌ని తెలిపారు. తాము త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రిస్తా మ‌ని కేసీఆర్ చెప్పారు. అయితే.. వ‌చ్చే త‌దుప‌రి ఎన్నిక‌ల్లో ఏమైనా ఉంటే చూసుకుంటామ‌న్నారు. మొత్తానికి.. కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల వెనుక‌.. అంత‌రార్థం ఎలా ఉన్నా.. ముందు మునుగుతున్న త‌న బీఆర్ ఎస్ నావ‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేయాల్సింది పోయి.. ప‌క్క‌రాష్ట్రంపై ఇంత దృష్టిపెట్ట‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.