సైనా సినిమాకు ఘోర పరాభవం

అనుకున్నదే అయింది. సైనా నెహ్వాల్ మీద తీసిన సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పరాభవం తప్పలేదు. ఈ సినిమా ట్రైలర్ చూసినపుడే ఇది ఆడే సినిమా కాదని బాక్సాఫీస్ పండితులు అంచనా వేశారు. ట్రైలర్ బాగా లేదని కాదు కానీ.. అందులో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేంత ఎమోషన్ అయితే కనిపించలేదు.

అయితే చరిత్రలో మరుగున పడిపోయిన క్రీడా దిగ్గజాల గురించి సినిమా తీస్తే, కొత్త విషయాలేమైనా చెబితే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది కానీ.. తెరిచిన పుస్తకం అనదగ్గ సైనా జీవితం గురించి సినిమా తీసి చూడమంటే ఆడియన్స్ ఎందుకు ఆసక్తి ప్రదర్శిస్తారన్నది మౌళికమైన ప్రశ్న. ‘బాగ్ మిల్కా బాగ్’ ఆడిందంటే.. మిల్కా సింగ్ జీవితంలో బోలెడంత డ్రామా ఉంది. దేశవిభజన నాటి పరిస్థితుల నుంచి ఈ కథ మొదలవుతుంది. ఆయన గురించి ప్రేక్షకులకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి.

ఇక ఎం.ఎస్.ధోని సినిమా విషయానికి వస్తే.. అందులో క్రికెట్ యాంగిల్ కంటే కూడా ధోని వ్యక్తిత్వాన్ని, అతడి వ్యక్తిగత జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది. ధోని జీవితంలోనూ డ్రామా ఉండటం కలిసొచ్చింది. కానీ సైనా నెహ్వాల్ విషయానికి వస్తే ఆమె టీనేజీలోనే పాపులారిటీ సంపాదించింది. ఆమె జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. పైగా పైన చెప్పుకున్న మిల్కాసింగ్, ధోని జీవితాల్లో ఉన్నంత డ్రామా ఈమె లైఫ్‌లో లేదు. వీటన్నింటికీ మించి పరిణీతి చోప్రా.. సైనా పాత్రకు అస్సలు ఫిట్ కాలేదన్నది మెజారిటీ మాట.

పైగా ఉత్తరాదిన కరోనా కారణంగా సినిమాలకు గడ్డు కాలం నడుస్తున్న సమయంలో విడుదలవడం కూడా ‘సైనా’కు ప్రతికూలంగా మారింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు కేవలం రూ.25 లక్షలు మాత్రమే వసూలు చేసిందంటే.. దీనికి ఎలాంటి స్పందన వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. రిలీజ్ ఖర్చులకు కూడా ఈ మొత్తం సరిపోదు. తొలి రోజే ఎన్నో చోట్ల ప్రేక్షకుల్లేక ఈ చిత్రానికి షోలు క్యాన్సిల్ చేయాల్సి రావడం ఇదెంత పెద్ద డిజాస్టరో చెప్పడానికి నిదర్శనం.